ఆసిఫాబాద్ : ఓటరు జాబితా సంక్లిప్త సవరణ 2022 కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో నిర్మించిన ఈవీఎం, వీవీపీటీ గోదాములను జిల్లా కలెక్టర్ రాల్రాజ్తో కలసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుంచి ఎస్ఎస్ఆర్-2022 కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరికీ వివరాలు తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
01-01-2022 నాటికి 18 ఎండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో పాటు రెండు, మూడు ఎపిక్ కార్డులు కలిగి ఉన్నా, చిరునామా మారినా, మృతి చెందిన వారి వివరాలు తొలగించడంతో పాటు పేరు , వివరాలు ఏమైనా సవరణ ఉంటే వాటిని సరిచేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటరు హెల్ప్లైన్ వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో బూత్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్న చోట త్వరగా భర్తీ చేయాలని, బూత్ స్థాయి అధికారులకు గరుడ యాప్ నిర్వహణను వివరించాలన్నారు.
జనవరి 5వ తేదీ వరకు నూతన ఓటర్ల నమోదు పూర్తి చేయాలని జనవరి 15వ తేది నాటికి తుది జాబితా తయారు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశం, ఆర్డీవోలు సిడాం దత్తు, చిత్రు, తాసీల్దార్లు, ఎన్నికల ఉప తాసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.