సోన్, నవంబర్ 26 : భారత రాజ్యాంగ నిర్మాణంలో బీఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ, పోలీస్ కార్యాలయంలో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. వందల ఏండ్ల బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశానికి ఎందరో మహాత్ముల త్యాగ ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం పొందిన మరో రెండేండ్ల తర్వాత రాజ్యాంగ రూపకల్పన చేశారని తెలిపారు. 1949, నవంబర్ 26న ఆమోదం పొందిన సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని సిబ్బంది ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీపీవో ఏవో వెంకటశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్పీ సీసీ వెంకటరమణ, ఆర్ఐలు రమేశ్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు, డీపీవో సిబ్బంది, ఎస్పీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.