సోన్, మే 17 : సరదాగా గడుపుదామని వెళ్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న వరద కాలువ నీటిలో పడి ఇద్దరు మృతి చెందారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. నిర్మల్లోని కురాన్నపేట్ సమీపంలోని చిక్కడపల్లికి చెందిన తండ్రి మహ్మద్ అబ్దుల్ ఫహీమ్, కుమారుడు మహ్మద్ సహాద్తో పాటు వారం క్రితం వీరి ఇంటికి వచ్చిన సమీప బంధువు మహారాష్ట్రలోని పుణేకు చెందిన మహ్మద్ భరక్తో కలిసి బుధవారం మధ్యాహ్నం సరదాగా గడుపుదామని నిజామాబాద్ జిల్లా మెండోరా సమీపంలోని గోదావరి తీరానికి వెళ్లారు. కాగా నీటిలోని బండరాయిపై మహ్మద్ భరక్ కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు నీటిలోకి జారాడు. వెంటనే కాపాడుదామని అబ్దుల్ ఫహీమ్ నీటిలోకి దిగాడు. వారు ఇద్దరు నీటిలో మునిగి పోయారు. కళ్ల ముందే తన తండ్రి మహ్మద్ అబ్దుల్ ఫహీమ్ (35), బంధువైన మహ్మద్ భరక్ (14) నీట మునగడంతో మహ్మద్ సహాద్ కేకలు వేస్తూ సమీపంలోని వారికి సమాచారమందించాడు. కాగా అప్పటికే మహ్మద్ అబ్దుల్ ఫహీమ్, మహ్మద్ భరక్ నీట మునిగి మృతి చెందారు. దీంతో నిర్మల్లోని చిక్కడపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.