నేరడిగొండ, జూన్ 13 : గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కిష్టాపూర్, శంకరపూర్, లింగట్ల గ్రామాల్లో బీటీరోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కోట్లాది రూపాయలతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు.
ప్రతి గ్రామానికి నిధులు కేటాయించి సీసీరోడ్లు, మురుగుకాల్వల నిర్మాణంతో పాటు తాగునీటి వసతి, కుల సంఘాల భవనాలు, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. మూడు రోడ్ల నిర్మాణానికి రూ.2.43 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనంతరం నేరడిగొండ ఎంపీపీ రాథోడ్ సజన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ దావుల భోజన్న, సర్పంచులు సోలంకి గీత, సాబ్లే స్వర్ణాంజలి, విశాల్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కిశోర్సింగ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నానక్సింగ్, మాజీఎంపీపీ ప్రేమ్సింగ్, నాయకులు పాల్గొన్నారు.