ఆదిలాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బాధితులతో కూడిన సీసీఐ సాధన కమిటీ ఏర్పడింది. సిమెంటు పరిశ్రమను తెరిపించాలంటూ నిరసనలు చేస్తున్న సాధన కమిటీ సభ్యులు గురువారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. వీరికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సంఘీభావం తెలిపారు. 1984 సంవత్సరంలో 4 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఐ 14 ఏళ్ల తర్వాత నవంబర్ 5, 1998లో ఉత్పత్తిని నిలిపివేసిందని సాధన కమిటీ సభ్యులు తెలిపారు. పరిశ్రమకు వేలాది ఎకరాల భూములు ఇచ్చిన వారు ఉపాధిని కోల్పోయారన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రారంభించాలని ఇందుకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ పలు మార్లు కేంద్ర మంత్రులను కలిసినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీసీఐని తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర తీరును నిరసిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టి వాటిపై ఆధారపడిన వారిని రోడ్డుపైకి తీసుకొస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం 2022 బడ్జెట్లో సీసీఐ ప్రారంభిండానికి అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
మభ్యపెడుతున్న కేంద్ర సర్కారు
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభిస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. తెరవాలని కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సీసీఐని తిరిగి ప్రారంభించాలంటూ 2015 నుంచి కేంద్రంలోని బీజేపీ మంత్రులను కోరుతున్నాం. నాలుగు సార్లు ఢిల్లీలో వారిని కలిసి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. రాష్ట్ర మంత్రి కేటీఆర్, నేను, మాజీ ఎంపీ నగేశ్లు ఢిల్లీకి వెళ్లి పరిశ్రమ వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేశాం. కేంద్ర మంత్రులు మాయమాటలు చెబుతూ మభ్యపెడుతున్నారు. సీసీఐ ప్రారంభానికి అన్ని రకాల సహాయం అందిస్తామని, రాయితీలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ కూడా కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదు. గతంలో బీజేపీ మాజీ మంత్రి హన్స్రాజ్ గంగారం ఆదిలాబాద్లో పర్యటించి సీసీఐని ప్రారంభిస్తామని చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. సాధన కమిటీ ఆందోళనకు పూర్తి మద్దతు అందిస్తాం.
సీసీఐ సాధించే వరకు పోరాటం..
కరోనా పేరిట కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు రూ.20 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రారంభించడానికి అవసరమైన నిధులు కేటాయించాలి. రాజకీయాలకతీతంగా సీసీఐ సాధించేంత వరకు పోరాటం చేస్తాం. ఢిల్లీకి పోయి నిరసన ప్రదర్శనలు చేపడుతాం. భూములు ఇచ్చిన వారు ఉద్యోగాలు కోల్పోవడంతో రోడ్డున పడ్డారు.
ఎన్నికల హామీ ఏమైంది..?
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ ఎన్నికల సమయం లో మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోవాలి. పరిశ్రమపై ఆధారపడిన ఉద్యోగులు, కార్మికులు.. భూములు కోల్పోయిన వారు వీధినపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ ప్రారంభానికి సహాయ, సహకారాలు అందిస్తామనడం సంతోషకరం.
– నంది రామయ్య, సాధన కమిటీ కో కన్వీనర్
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు..
కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తీవ్రంగా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సాధన కమిటీ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు చేపడుతాం. కేం ద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉం ది. అన్ని పార్టీలు, సంఘాలు, ప్ర జలు కలిసిరావాలి. సీసీఐ ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో సీసీఐ ప్రారంభం ఎజెండాగా ఉండాలి.
– లంకా రాఘవులు, సీపీఎం నాయకుడు