మంచిర్యాల, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో వెతుకుతున్న పేద యువకులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తక్కువ పని, అధిక ఆదాయం అంటూ పోస్టులు పెడుతూ బురిడీ కొట్టిస్తున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఉద్యోగం కోసమని ఆన్లైన్లో క్లిక్ చేస్తే.. మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఊడ్చేస్తున్నారు. ఆన్లైన్ వర్క్, టాస్క్లు అంటూ పెట్టుబడి పెట్టించి మోసం చేస్తున్నారు. ఇలా.. భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్ నేరగాళ్లు ఉన్నారనే విషయాన్ని గ్రహించాలని భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి మన మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఇచ్చామా అంటే అంతే సంగతులు. ఉద్యోగాల పేరిట మెయిల్కు మొబైల్కు లింక్ పంపిస్తారని, వాటిని ఏ మాత్రం క్లిక్ చేసినా మన సమాచారం మొత్తం తెలుసుకుని అకౌంట్లోని డబ్బులను ఊడ్చేస్తారని హెచ్చరిస్తున్నారు. మన వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. కొద్దిపాటి జాగ్రత్తలతో నేరగాళ్ల భారీ నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
జాగ్రత్తలు..
మంచిర్యాల జిల్లాకు చెందిన కృష్ణ పని కోసం హైదరాబాద్ వెళ్లాడు. ఓ పెద్ద బ్యాంక్లో కార్ లోన్ల రికవరీ ఉద్యోగం దొరికింది. వారం రోజులకు ఓ కష్టమర్ నుంచి ఈఎంఐ డబ్బులు రూ.80 వేలు వచ్చాయి. రాత్రి పేమెంట్ చేతికి రావడంతో డబ్బులు తన అకౌంట్లోనే ఉంచుకున్నాడు. ఇంకా ఏదైనా పార్ట్టైమ్ ఉద్యోగం చేద్దామని గూగుల్లో సెర్చ్ చేశాడు. రోజుకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు సంపాదించవచ్చు అనే యాడ్ కనిపించింది. దానిపై క్లిక్ చేయగానే ఫోన్ నంబర్ అడిగింది. ఎంటర్ చేయగానే వాట్సాప్ సందేశం వచ్చింది. పార్ట్ టైమ్ జాబ్ రోజూ కొన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే టాస్క్కు కొంత చొప్పున డబ్బులు ఇస్తామని ఉంది. తొలి టాస్క్కు రూ.100 పెట్టుబడి పెడితే రూ.600 తిరిగి వస్తాయనే సందేశం వచ్చింది. రూ.100 కదా అని తొలి టాస్క్ పూర్తి చేయగా రూ.600 వచ్చాయి. అలా తరువాత టాస్క్ల నుంచి పెట్టుబడి పెరిగి వచ్చే అమౌంట్ పెరుగుతూ వచ్చింది. చివరకు బ్యాంక్ డబ్బుల నుంచి రూ.72 వేల పెట్టుబడి పెట్టాక టాస్క్ మధ్యలో ఇది పూర్తి చేయాలంటే మరో రూ.లక్ష కావాలనే సందేశం వచ్చింది. దీంతో హైరానా పడిపోయిన కృష్ణ ఏం చేయాలో తెలియక తెల్లముఖం వేశాడు. బయటికి చెప్తే పరువు పోతుందనుకొని మిన్నకుం డిపోయాడు. ఆఫీస్ డబ్బులు వాడుకున్నందుకు కృష్ణ ఉద్యోగం పోయింది. అప్పు చేసి బ్యాంక్ డబ్బులు తిరిగి కట్టాడు. స్నేహితులకు ఈ విషయం చెప్పుకొని బోరున విలపించాడు.
ఆదిలాబాద్కు చెందిన అఖిల హౌస్ వైఫ్. పార్ట్టైమ్ జాబ్ కోసం ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లు సెర్చ్ చేసింది. ఈ క్రమంలో రోజుకు రూ.3వేల నుంచి రూ.7,500 వరకు సంపాదించే జాబ్ ఉంది అనే బ్లాగ్ ఓపెన్ చేయగా.. అది డీటెయిల్స్ అడిగింది. మరుసటి రోజు వాట్సాప్లో ఒక సందేశం వచ్చింది. మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మిగిలిన వివరాలు చెప్తామని చెప్పారు. అందుకు రూ.450 తీసుకున్నారు. మీటింగ్లో టైపింగ్ వర్క్ చేయాలని ట్రేయినింగ్ కోసం రూ.9 వేలు కట్టాలని చెప్పారు. విషయం ఆమె భర్తకు చెప్పడంతో ఉద్యోగం చేస్తే డబ్బులు ఇవ్వాలి. కానీ.. మనం డబ్బులు కట్టడం ఏంటని.. ఆ పని వద్దని చెప్పాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.