మంచిర్యాల అర్బన్, జనవరి 7 : కోటపల్లి మండలం అన్నారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి జుమ్మిడి మణిప్రసాద్ (గతేడాది పదో తరగతి-ప్రస్తుతం ఇంటర్) గతేడాది అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచాడు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చేతుల మీదుగా జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డు అందుకున్నాడు. ఈ యేడాది మేలో జపాన్లో నిర్వహించే సకురా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రామ్కు మణిప్రసాద్కు ఆహ్వానం అందగా, ప్రశసంలు వెల్లువెత్తుతున్నాయి. మణిప్రసాద్ను హెచ్ఎం రమేశ్, డీఈవో కార్యాలయ సెక్టోరల్ అధికారి చౌదరి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.
గ్రెయిన్ ప్రొటెక్టర్ ఫ్రం రెయిన్ అండ్ యానిమల్స్(వర్షం, పశువుల నుంచి పంటలు రక్షించుకోవడం)
గైడ్ టీచర్ పేరు : ఎస్ సురేందర్, ఎస్ఏ భౌతిక రసాయన శాస్త్రం.
ఉపోద్ఘాతం : రైతులు తాము పండించిన ధాన్యాన్ని మొదట ఆరబెడుతారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం రాకపోతే కేంద్రాల్లోనే ఉంచాల్సి వస్తుంది. వర్షం వస్తే ధాన్యాన్ని వెంటనే తడువకుండా తరలించడం, ఎత్తడం కష్టమవుతుంది. తడిస్తే గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోవాల్సి వస్తది. అలాగే ఆరబోసిన ధాన్యం చుట్టూ కంచె లేకుంటే పశువుల పాలవుతుంది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకునేందుకు ఈ ‘గ్రెయిన్ ప్రొటెక్టర్ ఫ్రం రెయిన్ అండ్ యానిమల్స్’ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.
పని చేసే సూత్రం : ద్రవాల విద్యుత్ వాహకతపై (తడి సెన్సార్ పై) ఆధారపడి పనిచేస్తుంది.
కావాల్సిన పరికరాలు : కర్రలు (గుంజలు), ప్లాస్టిక్ పైపులు, కవర్లు, రైన్ సెన్సార్, మోటర్ ప్రోగ్రామింగ్ మైక్రో కంట్రోలర్, సోలార్ ప్లేట్, 12వీ బ్యాటరీ. ఇనుప తీగ, బజార్ 1.5వీ బ్యాటరీలు.
పని చేసే విధానం : ధాన్యం (వడ్లు, కందులు, పెసలు, మొక్కజొన్న, జొన్న తదితర) ఆరబోసే ప్రాంతంలో రెండు వైపులా ఏటవాలుగా ఉండేటట్లు కర్రలు(గుంజలు), ప్లాస్టిక్ పైపులతో పందిరి (గుడిసె)లా ఏర్పాటు చేయాలి. దీని లోపల నేల కొంచెం ఎత్తుగా నిర్మించాలి. దానిపై కవర్ వేసి ధాన్యం ఆరబోయాలి. దీని పై భాగంలో ఒక మైక్రో కంట్రోలర్కి కలుపబడిన రైన్ సెన్సార్ అమర్చాలి. కవర్స్ రూలర్కి చుట్టి, ఈ రూలర్స్ మైక్రో కంట్రోలర్కు కలుపబడిన మోటర్కి జత చేయాలి. ఇప్పుడు చినుకులు రైన్ సెన్సార్పై పడగానే మైక్రో కంట్రోల్కి సమాచారం ఇస్తుంది.
మైక్రో కంట్రోలర్ మోటర్కి సమాచారం చేరవేస్తుంది. అప్పుడు మోటర్ రొటేట్ అవుతూ కిందికి వచ్చి ధాన్యంపై కవర్ కప్పబడుతుంది. దీంతో ధాన్యం తడువదు. అలాగే కింద నేల ఎత్తుగా ఉండి కవర్లో ధాన్యాన్ని ఆరబోయడం వల్ల నేలపై పడ్డ నీరు ధాన్యంలోకి రాదు. ఈ విధంగా రైతు తన ఆరబోసిన ధాన్యాన్ని వర్షం, జంతువుల నుంచి రక్షించుకోవచ్చు. దీనిని రైతులు అతి తక్కువ ఖర్చులో పంట పొలాల్లో గాని, ఇంటి వద్ద గాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది 12వీ బ్యాటరీతో పని చేస్తుంది. సోలార్ ప్లేట్లు ఉపయోగించి కరెంటు బ్యాటరీలో నిలువ చేసుకొని వాడవచ్చు. దీనిని ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్మిల్లుల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు.
2024, మేలో జపాన్లో నిర్వహించే సకురా ప్రోగ్రామ్లో మణిప్రసాద్ పాల్గొంటాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులకు ఈ అవకాశం వచ్చింది. అందులో మన జిల్లా విద్యార్థి ఉండడం అభినందనీయం. సకురా ప్రోగ్రామ్ ద్వారా సాంకేతికతను దగ్గర నుంచి తెలుసుకొని మరిన్ని ఆవిష్కరణలు రూపొందించేందుకు దోహదపడుతుంది.
– యాదయ్య, మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి