మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 7 : మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారిపై నాలుగు చోట్ల చేపడుతున్న జంక్షన్ల సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పట్టణ ప్రగతి నిధులతో ఐబీ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీటాకీసు చౌరస్తాల వద్ద జంక్షన్లను నిర్మిస్తున్నారు. ఒక్కో జంక్షన్ అభివృద్ధికి రూ. కోటి చొప్పున వెచ్చిస్తున్నారు. ప్రతీ జంక్షన్ వద్ద రోడ్డు మధ్యలో వృత్తాకారంలో ఆకట్టుకునేలా ఐలాండ్లను నిర్మిస్తున్నారు. ఇందులో గ్రీనరీ, శిల్పాలు, లైటింగ్, పౌంటేయిన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇకపై ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకుండా ఈ రోడ్లను తయారు చేస్తున్నారు. ఎవరికి వారు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థతో పనిలేకుండా తమ వాహనాలను నడుపుతూ ముందుకెళ్లేలా ప్రత్యేక డిజైన్ రూపొందించారు.
జంక్షన్లతోపాటు ఐబీ చౌరస్తా నుంచి ఎంసీసీ గేటు వరకు సెంట్రల్ మీడియన్తో డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణంలోని రహదారులను విస్తరించడం, జంక్షన్లను అభివృద్ధి చేయడం, సెంట్రల్ లైటింగ్, డివైడర్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను సులభతరం చేయడం, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే దివాకర్రావు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో కలిసి పలుమార్లు చర్చించారు. మున్సిపల్, ఆర్అండ్బీ, ఇతర శాఖల అధికారులతో పట్టణ అభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేసి ఆ మేరకు పనులు చేపడుతున్నారు. రోడ్డు మధ్యలో ఐలాండ్లను నిర్మించడంతో దాని చుట్టూ నాలుగు పక్కలా ఉండే రోడ్లకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గమనించిన అధికారులు ఈ మేరకు రోడ్డు వెడల్పు పనులను వేగిరం చేశారు. నాలుగు జంక్షన్లలో రోడ్డు వెడల్పు పనులను చేపడుతున్నారు. మరో వారంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తికానున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత జంక్షన్లలో సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు.