భీంపూర్, జూలై 10 : నిషేధిత సరకులు, మద్యం లాంటివి అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు చెక్పోస్టు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఎస్పీ సోమవారం తలమడుగు పోలీస్ స్టేషన్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లక్ష్మీపూర్ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహారాష్ట్ర దేశీదారు రవాణాపై దృష్టి పెట్టాలని సూచించారు. స్టేషన్లో స్నేహపూర్వక పోలీసింగ్ వాతావరణం ఉండాలన్నారు.
పోలీసు స్టేషన్, చెక్పోస్టుల్లో అందరూ బాధ్యతగా పనిచేయాలని , నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర లక్ష్మీపూర్ చెక్పోస్టు పరిసరాలు, రోడ్డుపై సీసీ కెమెరాల్లో వాహనాలను పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేని వాహనాలను కఠినంగా నియంత్రించాలన్నారు. చెక్పోస్టుద్వారా అనుమానిత వాహనాలు వెళితే తక్షణం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ ఐ సైదారావు, ఎస్ఐ అప్పారావు , సిబ్బంది ఉన్నారు.