కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): “ఇది ప్రభుత్వ స్థలం. దీనిని ఎవరైనా ఆక్రమించినచో చట్టరీత్య చర్య తీసుకోబడును”. ఇది సుమారు ఆరు నెలల క్రితం ఆసిఫాబాద్ శివారులోని బీడీపీపీ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు. ప్రస్తుతం అక్కడ బోర్డు తొలగిపోయింది. అదే స్థలంలో క్రమంగా ప్లాట్లు వెలుస్తున్నాయి. అధికారుల అండదండలు కలిగిన కొందరు కబ్జాదారులు సుమారు 3 ఎకరాల బీడీపీపీ స్థలాని ఆక్రమించి అమ్మకానికి పెడుతున్నట్లు తెలిసింది.
ఆక్రమించి.. ప్లాట్లు చేసి..
ఆసిఫాబాద్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న ప్రభు త్వ స్థలాలు కబ్జాదారులకు వరంగా మారుతున్నాయి. ఏడాది కిందటి వరకూ ప్రభుత్వ స్థలాలుగా ఉన్న భూములు.. కబ్జాదారుల చెరలో చిక్కుకొని పాట్లుగా మారుతున్నాయి. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారుల ఆగడాలకు హద్దులేకుండా పోతుందనడానికి ఇదే చక్కని ఉదాహరణ..
ఆసిఫాబాద్ శివారులో ని సర్వే నంబరు 45లో 20 ఎకరాలున్నాయి. దీనిని బై నంబర్లుగా విభజించి.. 16 భాగాలుగా చేశారు. వీటిలో గతంలో కొందరికి 17 ఎకరాలకు పట్టాలివ్వగా, మిగిలిన 45/బీడీపీపీ/1, 45/బీడీపీపీ/2 సర్వే నంబర్లలో సుమారు 3 ఎకరాల భూమి.. ప్రభుత్వ ఆధీనంలో ఉంది. గతేడాది ఈ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేయడానికి ప్రయత్నాలు జరగగా, రెవెన్యూ అధికారులు గుర్తించి.. ఇది ప్రభుత్వ స్థలమని.. ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని బోర్డును సైతం ఏర్పాటు చేశారు. అయితే, ఆరు నెలలైనా గడవకముందే ఆ బోర్డును తొలగించి మరీ ప్లాట్లు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది.
అన్యాక్రాంతమవుతున్నా అలసత్వం..
ఆసిఫాబాద్ శివారులోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆసిఫాబాద్లోని భూములను కబ్జాచేయడమే వ్యాపారంగా మలుచుకున్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకోవడం, ప్రభుత్వ భూములు ఎక్కడ ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని తెలుసుకోవడం, మూడో కంటికి తెలియకుండా ప్లాట్లు వేసి విక్రయించడం పరిపాటిగా మారింది.
2017లో ప్రభుత్వ భూములపై సర్వే చేపట్టిన అధికారులు వాటి పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అధికారులకు మామూళ్ల ఆశచూపి కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేస్తున్నారన్న విమర్శలున్నాయి. సర్వే నం. 45లో ఉన్న మూడెకరాల బీడీపీపీ భూమి చుట్టూ.. పట్టా భూములున్నాయి. మధ్యలోనున్న ఈ మూడెకరాల ప్రభుత్వ స్థలంపై కన్నేసిన కబ్జాదారులు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.