విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం..
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
బాసర, జూన్ 15 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలను పరిష్కరించాలని రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కళాశాలను సందర్శించారు. ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిసి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్జీసీ(స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్)తో చర్చలు జరిపారు. గురువారం విద్యార్థుల డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ వెళ్లి పోయారు. మొదటి సారి చర్చలు విఫలం కావడంతో సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ సమావేశం నిర్వహించారు. సమస్యలు పరిష్కరిస్తామని బలమైన హామీ ఇవ్వడంతో విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లిపోయారు.
అనంతరం బాసర పోలీసుస్టేషన్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఏఎస్పీ కిరణ్కారేలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నేటి నుంచి విద్యార్థులు తప్పకుండా తరగతులకు హాజరుకావాలని సూచించినట్లు చెప్పారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం, ఐసీటీ తరహాలో విద్యా భోదనతోపాటు ఎలక్ట్రికల్ ఫ్లంబింగ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపామన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, వైస్ చాన్స్లర్ రాహుల్ బొజ్జా, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే విఠల్రెడ్డిలకు వీడియో కాన్ఫరెన్సులో సమస్యను వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాలని తెలిపినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను తప్పనిసరిగా నెరవేరుస్తామని, విద్యార్థులు తరగతి గదులకు హాజరు కావాలని సూచించామన్నారు.