ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్రావు
పెంచిన గ్యాస్ ధరపై నిరసన
మంచిర్యాలటౌన్, జూలై 7: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంచడాన్ని నిరసిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నల్ల జెండాలను చేతబూని, ప్లకార్డులు పట్టుకుని, గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. టీఆర్ఎస్ యూత్ నాయకుడు నడిపెల్లి విజిత్రావు ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి వంట చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1150 అయిందని, గ్యాస్తోపాటు పెట్రోలు, డీజిల్, వంట నూనెలు, నిత్యావసరాల ధరలను అమాంతంగా పెంచిందన్నారు. పేద, మధ్యతరగతి, మహిళలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. మోదీ ప్రజలకు ప్రధానిగా కాకుండా అదానీ, అంబానీలకు ప్రధానిగా పనిచేస్తున్నారని విమర్శించారు.
ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, సింగరేణి, రైల్వేల వంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు చట్టాలను తీసుకువచ్చి, తీవ్ర వ్యతిరేకత వల్ల మోదీ వెనక్కి తగ్గారన్నారు. అదే విధంగా దేశ ప్రజలంతా పడుతున్న ఇబ్బందులను గుర్తించి గ్యాస్తోపాటు పెట్రో, నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణాకు జీఎస్టీ నిధులు, ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ మోదీ గద్దెనెక్కిన నాటి నుంచి మహిళలపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని, వంట గ్యాస్ధరలు, వంటనూనెల ధరలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. మహిళల ఆగ్రహానికి గురైన ప్రభుత్వాలు పతనమవ్వడం ఖాయమని అన్నారు. భవిష్యత్లో కేసీఆర్ దేశ ప్రధానిగా బా ధ్యతలు చేపడుతారని, అందుకు ప్రజలు మద్దతు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, జంగం కళ, వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ యూత్ నాయకులు నడిపెల్లి విజిత్రావు, గోగుల రవీందర్రెడ్డి, జయరామారావు, తోట తిరుపతి, సుదమల్ల హరికృష్ణ, బొలిశెట్టి రాజన్న, సందెల వెంకటేశ్, రాకేశ్, ప్రవీణ్, సరోజ, పద్మ, అన్నపూర్ణ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.