బెల్లంపల్లి, డిసెంబర్ 31: 2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వాటికి సంబంధించిన సామగ్రి కొనుగోలు చేస్తుండడంతో బజార్ ఏరియాలో సందడి నెలకొన్నది. బజార్ ఏరియా నుంచి మార్కెట్ ఏరియా వరకు రంగులు, కేక్లు, క్యాలెండర్లు విక్రయించే దుకాణాలు వెలిశాయి. దుకాణాదారులు పోటీ పడి ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
కేక్, కూల్కేక్, ఎగ్లెస్ కేక్లను కొంటే కూల్ డ్రింక్లు ఉచితం అంటూ ప్రకటించి వివిధ రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. వివిధ రకాల చికెన్, మటన్ వెరైటీలతో మాంసం ప్రియులను ఆకర్షిస్తున్నారు. చికెన్, మటన్ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సాయం త్రం నుంచి సోమవారం రాత్రి వరకు ఆనందంగా గడిపేందుకు యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. చిన్న టెంట్లు వేసుకుని పార్టీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సౌండ్ సిస్టమ్తో డ్యాన్స్లు చేస్తూ హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేశారు.
తాండూర్, డిసెంబర్ 31 : మండల వ్యాప్తంగా కొత్త సంవత్సరం జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది. స్పెషల్ ఆఫర్లతో మండలం అంతటా కేకుల అమ్మకాలు జోరుగా సాగాయి. చాలా చోట్ల కేక్లను అందంగా తయారుచేసి, వాటిని విక్రయించేందుకు టెంట్లు వేశారు. కొందరు వ్యాపారులు రంగులు కూడా అమ్మకానికి ఉంచారు. వాటిని కొనుగోలుకు పలువురు ఉత్సాహం చూపారు. మండలకేంద్రంలోని పలు హోటళ్ల యజమానులు సైతం స్పెషల్ ఆఫర్ల పేరుతో బిర్యానీలు, స్పెషల్ వంటకాలు తయారుచేసి విక్రయాలు కొనసాగిస్తున్నారు. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024కు ఆహ్వానిస్తూ మండలంలోని ప్రజలు, యువకులు, చిన్నారులు మధ్యాహ్నం నుంచే సందడి వాతావరణం కనిపించింది.
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 31 : అంజనీపుత్ర సంస్థ జిల్లా కార్యాలయంలో, జైపూర్ మండలం దుబ్బపల్లిలోని డైమండ్ సిటీలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి కేక్ కట్ చేసి డైరెక్టర్లకు, కస్టమర్లకు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహకారంతో ఇటు వ్యాపారం, అటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 31 : మంచిర్యాల పట్టణంలోని ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల ఆవరణలో యాజమాన్యం, విద్యార్థులు ఆదివారం సాయంత్రం 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబురాలు జరిపారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం నృత్యాలు చేస్తూ, కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం పెట్టం మల్లేశ్, మనయ్య, శ్రీకర్, సిబ్బంది, విద్యార్థులు తదితరులున్నారు.