ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన
ఇచ్చోడ, ఫిబ్రవరి 6 : గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే జిల్లా పోలీసుల లక్ష్యమని, గంజాయి సాగు నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మండల కేంద్ర మైన ఇచ్చోడలోని రైతు వేదిక భవనంలో ఆదివారం ఇచ్చోడ సర్కిల్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లకు గంజాయి సాగు, మాదక ద్రవ్యా ల నిర్మూలనపై అవగా హన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం ఎంతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నదని, పరిశ్రమలు ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. గంజాయి మత్తుకు యువత, ప్రజలకు బానిసలుగా కాకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించి, గంజాయి, మాదక ద్రవ్యాలను నిర్మూలించాలనీ స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల రవాణ చేస్తున్న వారిని పట్టుకుని వారిపై పీడీ యాక్టు కేసులను నమోదు చేస్తున్నామని చెప్పారు. నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు, గంజాయి, మాదక ద్రవ్యాలపై పోలీసులు చేస్తున్న పోరాటంలో ప్రజా ప్రతినిధులు, అధి కారులు, ప్రజలందరు సహకరించాలనీ ఆయన కోరారు. గంజాయికి యువత అలవాటు పడకుండా ఉండేందుకు గ్రామాల వారీగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ చైతన్యం పర్చుతున్నట్లు ఎస్పీ వివరించారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఎక్సైజ్శాఖ సూపరింటెండెంట్ ఎస్. రవీందర్, ఇచ్చోడ సీఐ రమేశ్ బాబు, స్థానిక ఎస్ఐ ఉదయ్ కుమార్, ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ రాజమౌళి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.