నార్నూర్, మార్చి 12 : గ్రామీణ యువత జీవనోపాధి కోసం ఎక్కువగా ప్రైవేట్ వాహనాల డ్రైవర్లుగా మారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలను నడపడంతో ప్రాణాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. వాహన పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటో, జీపు, టాటామ్యాజిక్, టాటాఏస్ తదితర వాహనాలను నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర నష్టం చవి చూడాల్సి వస్తున్నది. ఇక జీపులో సీటు కెసాసిటీ ఏడుగురు, చిన్న ఆటోలో నలుగురు, పెద్ద ఆటోలో ఏడుగురు, టాటా మ్యాజిక్లో ఏడుగురు ప్రయాణించాలన్న నిబంధన ఉంది. అందుకు విరుద్ధంగా 20మందికి తగ్గకుండా ప్రయాణికులను ఎక్కించుకొని నడుపుతున్నారు. వ్యవసాయానికి వాడాల్సిన ట్రాక్టర్లను సైతం పంట పొలాల్లో పని చేసే దినసరి కూలీలను తరలించేందుకు వినియోగించడంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలూ లేకపోలేదు.
ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాగా, గ్రామాల్లో ఎక్కువగా కాలం చెల్లిన వాహనాలనే తక్కువ ధరకు తీసుకొచ్చి వాడడంతో వాతావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నది. వీటితో కార్బన్ మోనాక్సైడ్ విడుదల కావడంతో వాతావరణం కలుషితమై మానవాళి అనేక రోగాల బారిన పడుతున్నది. ఆర్టీఏ, పోలీస్ అధికారులు తనిఖీలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. గ్రామాల్లో తిరిగే ఆటోలు, జీపులు, టాటామ్యాజిక్ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నార్నూర్ సీఐ కే ప్రేమ్కుమార్ సూచిస్తున్నారు. ఓవర్స్పీడ్, ఓవర్ లోడ్తో వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాల పేపర్లు లేని వాటిపై చట్ట ప్రకారం సీజ్ చేస్తామని పేర్కొంటున్నారు.