దస్తురాబాద్, జనవరి 4 : జంగుబాయి మహా పూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు వచ్చిన ఆత్రం వంశీయులు బుధవారం తిరుగుపయనమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలం కల్లూర్ గూడెం నుంచి 4 కుటుంబాలకు చెందిన 45 మంది, తమ కులదేవత జంగుబాయితో పాదయాత్రగా మంగళవారం మండలంలోని భూత్కూర్లోని రాంపూర్ గోదావరి తీరానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, అక్కడే పూజలు చేసి, బస చేశారు. కాగా బుధవారం గోదావరి స్నానాలు చేసి, దేవతకు అభిషేకం చేశారు. గంగా జలం సేకరించారు.
అ నంతరం దేవత విగ్రహాలు, దీపాలు, సతిక్ దేవతలకు వారి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత డోలు వాయిస్తూ, డప్పు చప్పుళ్ల నడుమ తిరుగు పయనమయ్యారు. బుధవారం రాత్రి మైసంపేటలో రాత్రి బస చేసి, తిరిగి పయనమై, గురువారం వారి గ్రామానికి చేరుకోనున్నారు. గంగాజలంతో జంగుబాయి దేవతలకు మహాపూజ నిర్వహించి, అభిషేకం చేస్తామని ఆ త్రం వంశీయులు తెలిపారు. ప్రతీ రెండు, మూ డేండ్లకోసారి గోదావరికి వచ్చి పుణ్యస్నానాలు చేసి, గంగాజలం తీసుకెళ్తామని పేర్కొన్నారు.
మున్యాల గోండు గూడెంలో పూజలు..
మండలంలోని మున్యాల గోండు గూడెం నుంచి జంగుబాయి దేవతలను తీసుకొని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం రాయల్ గొంది జంగుబాయి దర్శనానికి ఆదివాసీలు బయల్దేరారు. అంతకు ముందు గ్రామంలో సంప్రదాయ పద్ధతిలో డప్పుచప్పుళ్లతో జంగుబాయి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తగా తయారు చేసిన వెదురుబుట్టలో పంట ధాన్యాన్ని తీసుకొని జంగుబాయి విగ్రహాలు, సతిక్ దేవతలతో తరలివెళ్లారు. యేటా పుష్యమాసంలో దేవతలకు నియమనిష్టలతో పూజించడం ఆనవాయితీ అని ఆదివాసీ కుల పెద్దలు వివరించారు. తరలిన వారిలో దాత నాగుస్వామి, ఆదివాసీ కుల పెద్దలు, ఆదివాసులు, మహిళలు తదితరులున్నారు.