ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు ఘటనలు, అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం మినహా ఏమి జరుగలేదు. ఉదయం పోలింగ్ మందకొడిగా సాగగా.. మధ్యాహ్నం వరకు పుంజుకుంది. నాలుగు గంటల వరకు ఆదిలాబాద్లో 73.58, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 71.63, మంచిర్యాలలో 70.71, నిర్మల్లో 71.47 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, బీఆర్ఎస్ అభ్యర్థులు, అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వినియోగించుకున్నారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో నాలుగు గంటల వరకు.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో కేంద్రాలకు వచ్చి క్యూలో నిలబడ్డవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటింగ్ ముగిసిన వెంటనే సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయగా.. ఎల్లుండి(ఆదివారం) ఓట్లు లెక్కించనున్నారు.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ)
మంచిర్యాల, నవంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,857 పోలింగ్ కేంద్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించాయి. పది నిమిషాల నుంచి అర గంట వరకు ఇబ్బంది అయింది. వెంటనే స్పందించిన అధికారులు ఈవీఎంలను మార్చడడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నిక కొనసాగింది.
సమస్యాత్మక నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంప ల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్లో పోలింగ్ను గంట ముందుగానే ముగించారు. సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చినవారందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి వరకు ఓటింగ్ జరిగింది. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో కాస్త ఆలస్యమైంది.
పోలింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 12.30 దాటిన తరువాత ఓటర్ల రాక పెరిగింది. 3 గంటలకు అధికమైంది. వ్యవసాయ పనుల నుంచి వచ్చిన కూలీలు, ఇతర పనులు చేసుకునేవారు మూడు దాటాకే కేంద్రాలకు వచ్చారు. దీంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమైంది. దీంతో పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు రావడం ఆలస్యమైంది. రాత్రి 9 వరకు అన్ని కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి వచ్చి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి వాటిని లెక్కింపు కేంద్రాలకు తరలించనున్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్లను హజీపూర్ మండలంలోని ఐజా కాలేజీకి తరలించనున్నారు. మూడో తేదీన ఓట్లు లెక్కింపు ఉండనుంది.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తన సొంత గ్రామమైన జైనథ్ మండంలంలోని దీపాయిగూడలో, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్ నేరడిగొండ మండలం రాజూరలో తమ కుటుంబసభ్యులతో, మాజీ ఎంపీ నగేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బజార్హత్నూర్ మండలంలోని జాతర్లలో, కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు ఆదిలాబాద్లో ఓటు వేశారు. నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన స్వగ్రామమైన ఎల్లపెల్లిలో, ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జన్సన్ నాయక్ పట్టణంలోని శాంతినగర్లో గల పాఠశాలలో, ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డి తన స్వగ్రామైన భైంసా మండలంలోని దేగాంలో ఓటు వినియోగించుకున్నారు.
ఆసిఫాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి తిర్యాణి మండలంలోని భీంజీగూడలో, సిర్పూర్(టి) బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప కాగజ్నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ విద్యాలయంలో ఓటు వేశారు. మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాలలోని హిందీ హైస్కూల్లో, చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, విప్ బాల్క సుమన్ తన సతీమణి రాణి అలేఖ్యతో కలిసి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలో క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నెన్నెల మండలంలోని జెండావెంకటాపూర్లో ఓటు వేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురు మదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలోని ఎంగ్లాపూర్ గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు. ఓటు వేసేందుకు వెళ్లకుండా వంటావార్పు చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలంలో గల వరిపేట వాసులు పోలింగ్కు దూరంగా ఉన్నారు. అధికారులు సర్ది చెప్పడంతో మధ్యాహ్నం 2 గంటల తరువాత ఓటు వేశారు. బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలంలో గల గొల్లగఢ్, తాంసి గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్కు చెందిన చంద్రగిరి రాజన్న(65), మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ(76) ఓటు వేయడానికి వచ్చి మృతిచెందారు. మంచిర్యాల నియోజకవర్గంలోని పాత మంచిర్యాలలోని ఓ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్సాగర్రావు అత్యుత్సాహం ప్రదర్శించారు.
పోలింగ్ ఆలస్యం కావడంతో అక్కడికి వచ్చిన ఆయన లైన్లో నిలుచున్న ఓటర్లకు కుర్చీలు వేయాలని అధికారులను కోరారు. అనంతరం పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి సెల్ఫోన్ బయటికి తీశారు. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. విషయం తెలుకున్న ఇరు పార్టీల శ్రేణులు అక్కడికి రావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రేమ్సాగర్ రావు ముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారు. భీమారం మండల కేంద్రంలోని ఓ పోలింగ్ బూత్లో కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. ఈవీఎం బాక్సులు ఎత్తుకుపోయారని ఆరోపిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ పోలింగ్ కేంద్రానికి రావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీసీపీ రాంనాథ్ కేకన్ అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఈవీఎంలు పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లే వరకు కాంగ్రెస్ నాయకులు అక్కడే ఉంటామని భీష్మించుకు కూర్చోవడడంతో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. కాగజ్నగర్లో రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు, బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాయకులు, కార్యకర్తలతో ధర్నాకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో అప్పటికే అక్కడున్న రెండు పార్టీల నాయకులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకొని, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు అందరినీ చెదరగొట్టడంతో వివాదం సద్దు మణిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కువైట్ నుంచి ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన సయ్యద్ మహబూబ్ అలీ వచ్చారు. గురువారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి ఆదిలాబాద్కు వచ్చి ఓటు వేశారు. 15 ఏండ్లుగా కువైట్లో ఉంటున్నానని, ప్రతి ఎన్నికకు వస్తానని తెలిపారు. సొంత ఖర్చు పెట్టుకొని వచ్చానని, తిరిగి డిసెంబర్ 2వ తేదీన వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ధోబీకాలనీకి చెందిన రంగు శ్యాంరాజ్ గౌడ్-మనోరమ దంపతులు అమెరికా నుంచి వచ్చి ఓటు వేశారు. నిర్మల్ పట్టణంతో పాటు పలు చోట్ల ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.