సోన్, డిసెంబర్ 18 : యాసంగి సీజన్ ప్రారంభంకాగా, అన్నదాతలకుతీపి కబురు అందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతీ కెనాల్ ద్వారా సాగునీటిని సోమవారం నుంచి అందించేందుకు ఎస్సారెస్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి సరస్వతీ కెనాల్ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నారు. దీనిద్వారా సుమారు 35,780 ఎకరాలకు సాగునీటిని అందించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. సరస్వతీ కెనాల్ పరీవాహక ప్రాంతంలోని నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్ మండలాల్లో రైతులు వరి పంట సాగు చేయనున్నారు.
ఇప్పటికే సీజన్ ప్రారంభం కావడంతో రైతులు నార్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిని విడుదల చేసేంతగా నిల్వ ఉంది. దీంతో అధికారులు యాసంగి పంటకు కావాల్సిన సాగునీటిని సరస్వతీ కెనాల్ ద్వారా విడుదల చేయనున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో ప్రధానంగా వరి సాగుకు ప్రాధాన్యత ఉండడంతో వరి రైతులు ఈ సాగునీటి ద్వారా పండిస్తారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం పాక్పట్ల శివారు ప్రాంతం గాంధీనగర్ వద్ద సరస్వతీ కెనాల్ ప్రారంభమవుతంది. నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లోని దాదాపు 64 గ్రామాల పరిధిలో గల సాగు భూములకు వ్యవసాయానికి నీరు అందనుంది.
నేటి నుంచి వరుసగా ఏడు రోజులు నీటిని విడుదల చేయనున్నారు. మరో వారం వరకు నీటి విడుదలను నిలిపివేస్తారు. ఇలా వారబందీ పద్ధతి ద్వారా యాసం గి పంట పూర్తయ్యే వరకు నీరు అందనుంది. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ అవుట్ఫ్లో ద్వారా సరస్వతీ కెనాల్కు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు అందించనున్నారు. రైతులు ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకొని పంట దిగుబడి సాధించేలా ప్రణాళికలు వేసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరస్వతీ కెనాల్ ద్వారా సోమవారం నుంచి సాగునీటిని విడుదల చేయను న్నాం. వారబందీ పద్ధతి ద్వారా నీటిని విడుదల చే యనున్న నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకోవాలి. ఆయకట్టు పరీవాహక ప్రాంత రైతులు చేపల వేటకు, పశువుల కాపరులు, కాలువల వెంబడి మో టార్లు పెట్టిన రైతులు కాలువల్లోకి దిగవద్దు. పంపుసెట్లు కాలువ ప్రవాహంలో కొట్టుకు పోకుండా రైతులు జాగ్రత్తలు వహించాలి. 800 క్యూసెక్కుల నీటిని వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నాం. దీనిద్వారా 35,780 ఎకరాలకు ప్రయోజనం చేకూరనుంది.
బీ రామారావు, ఈఈ, డివిజన్ -3,
నీటిపారుదలశాఖ, నిర్మల్