మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 9 : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం ఈ నెల నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలల్లో పకడ్బందీగా అమలవుతుండడంతో అన్ని ప్రభుత్వ కళాశాలల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో 2016-17లో విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానం ప్రవేశపెట్టగా సాంకేతిక కారణాలతో ఆగింది. అనంతరం కరోనాతో పక్కన పెట్టారు. తిరిగి నూతన యంత్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించడంతో సత్ఫలితాలనిస్తోంది. వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ప్రభుత్వం అమలు చేయనుంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలులోకి తీసుకురావడంతో హాజరు శాతం పెరగడమే కాకుండా సమయపాలన మెరుగుపడుతుంది. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 201(బోధనా సిబ్బంది 155, బోధనేతర సిబ్బంది 36, 10 మంది ప్రిన్సిపాల్స్) పని చేస్తున్నారు. వీరు రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. కళాశాలల్లో కొత్తగా ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రాల్లో ఉదయం కళాశాలకు వచ్చిన వెంటనే, సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో హాజరు నమోదు చేస్తున్నారు.
విధులకు అధ్యాపకులు, ఉద్యోగులు నిర్ణీత సమయానికి హాజరు కావాల్సిందే. ప్రతి ఒక్కరూ వేలిముద్ర వేయాల్సిందే. దీనితో సిబ్బందిలో క్రమ శిక్షణ మెరుగవుతోంది. అంతే కాకుండా సరైన సమయంలో విద్యతోపాటు కళాశాల కార్యాలయ పనులు ఏమైనా ఉంటే అందనున్నాయి. అంతే కాకుండా అందరి వివరాలు ఆన్లైన్లో పర్యవేక్షించవచ్చు. గైర్హాజరు శాతం ఎక్కువగా ఉంటే దానికి గల కారణాలు తెలుసుకోవచ్చు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే అవకాశం ఏర్పడింది. – శైలజ, డీఐఈవో, మంచిర్యాల
ఈ విధానంతో అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలి. ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్ వర్డ్లను కేటాయించారు. వీటి ఆధారంగా నాతోపాటు అధ్యాపకులు(రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్)తో పాటు సిబ్బంది హాజరు ఇస్తున్నారు. ఈ వివరాలు ఉన్నతాధికారులు ఆన్లైన్లో చూస్తారు.
– రవి కుమార్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంచిర్యాల