ఆదిలాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ) ః కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) లోక్సభ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీ ల ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, వాల్ రైటింగ్, ప్రభు త్వ కార్యాలయాల్లో ఫొటోలను తొలిగిస్తున్న ట్లు పేర్కొన్నారు. ప్రచారం నిర్వహించే రాజకీయ పార్టీల నాయకులు ముందుగా అనుమ తి తీసుకోవాలని సూచించారు. అందరూ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రలోభాలకు గురిచేసే వారిపై చర్యలు తీసుకుంటామని, నిబంధనల ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సోషల్ మీడియాలో నిబంధనలకు విరుద్ధంగా పోస్టు లు పెట్టిన వారిపై చర్యలు ఉంటామని హెచ్చరించారు. ఇందుకోసం ఎంసీసీ, సర్వేలైన్ బృందాలు, ఫ్లయింగ్ స్కాడ్లు, వీడియో సర్వేలైన్ బృందాలు, ఎంసీఎంసీ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్వహణకు పూర్తిస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉన్నారని, అవసరమైన శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. అర్హులు ఓటరు జాబితాలో పేరు చూసుకోవాలని, పేరులేని వారు ఏప్రిల్ 15వ తేదీలోగా వివరాలను బీఎల్వోకు అందజేసి నమోదు చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 వేలకు పైగా కొత్త ఓటరు కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
16.44 లక్షల ఓటర్లు
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎస్టీ-1 కాగా.. మూడు జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందు లో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, మథోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ ఉండగా.. ఇందులో 16,44,715 మంది ఓటర్లు ఉన్న ట్లు ఎన్నికల అధికారి వివరించారు. పురుషులు 8,02,575.. మహిళలు, 8,42,054, ఇతరులు 86, 2,085 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 2,111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మరో 80 ఆక్సీలరీ కేంద్రాలు కూడా ఉంటాయన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని.. 85 ఏండ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి వద్ద నుంచి ఓటును వినియోగిచుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు మోడల్, ఐదు మహిళ, ఒక దివ్యాంగుల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ శాతం పెంచడానికి స్వీప్, ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలు రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే అందుకు అవసరమైన పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. నగదు సమస్యల పరిష్కారానికి జిల్లా సహకార శాఖ అధికారి మోహన్ను నోడల్ అధికారిగా నియమించామని, 8328683 965 ఫోన్ నంబరుకు సంప్రదించాలన్నారు.
సరిహద్దుల్లో తనిఖీలు.. : ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఇందుకు ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, తనిఖీలను వీడియో రికార్డింగ్ చేస్తున్నామన్నారు. శాంతిభద్రతలు కాపాడడంతోపాటు ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్య లు తీసుకున్నామని, సీ-వీజిల్, డయల్-100, 1950 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రజలు 87126 59973 వాట్సాప్ నంబరుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు కేంద్ర బలగాలు కూడా వస్తాయని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.