దేశ రక్షణలో ముందుండేది ఆర్మీ. నెలల తరబడి కుటుంబాలకు దూరంగా మాతృభూమి సేవలో తరించే ఈ జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. కాల్చేసే వేడి.. కొరికేసే చలి.. తడిపి ముద్ద చేసే వర్షం ఇబ్బంది పెట్టినా అహర్నిశలు సంసిద్ధులై ఉంటారీ యోధులు. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా శత్రువుల తుపాకుల నుంచి వచ్చే బుల్లెట్లు.. బాంబుల మోతలు.. మోర్టార్ల గర్జనల నడుమ, అత్యంత క్లిష్ట సమయాల్లో నిత్య ప్రాణసంకటంగా జీవితాన్ని గడిపే ఈ సైనికులే మన ధైర్యం. అలాంటి సైన్యంలో మన జిల్లా యువకులెందరో సేవలందిస్తున్నారు. నేడు(ఆదివారం) ‘ఆర్మీ డే’ సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం. -ఇచ్చోడ
ఇచ్చోడ/బజార్హత్నూర్, జనవరి 14: దేశరక్షణలో భాగంగా సరిహద్దుల్లో పని చేయడానికి పలువురు యువత ఆసక్తి చూపుతున్నారు. దేశంపై మమకారంతో ఆర్మీలో పని చేయడానికి ముందుకొస్తున్నారు. 24 గంటలపాటు దేశ సరిహద్దులో కాపాలా కాస్తూ ప్రాణాలు లెక్క చేయకుండా దేశ రక్షణలో తరిస్తున్నారు. వంద కోట్ల భారతీయులను కాపాడుకునేందుకు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ మంచుకొండల్లో ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తున్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మేమున్నామంటూ సేవలందిస్తున్నారు. దేశ ప్రజలు ప్రశాంత జీవనానికి ఈ సైనికులే కారణం. ఈ నెల 15న దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
భారతదేశ మొట్టమొదటి సైనిక కమాండర్గా కేఎం కరియప్ప 1948 జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఏటా జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవాన్లను ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు.వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశ సేవలో సాహసాలు ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు అందజేస్తారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల యువత సరిహద్దులో సేవే లక్ష్యంగా ఆర్మీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో 120 మంది యువకులు ఆర్మీలో చేరారు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్, కొల్హారి, శాంతపూర్ గ్రామాలకు చెందిన 80 మంది, బోథ్ మండల కేంద్రంతోపాటుగా సొనాల, గుర్రాలతండా, మర్లపెల్లి గ్రామాలకు చెందిన 150 మంది, బజార్హత్నూర్ మండలకేంద్రంతోపాటుగా భూతాయి, చందునాయక్తాండ, దెగామ గ్రామాలకు చెందిన 60 మంది యువకులు ఆర్మీలో చేరి దేశ సేవలో తరిస్తున్నారు. ఇంద్రవెల్లి, నార్నూర్, జైనథ్, బేల,సిరికొండ మండలాలకు చెందిన యువత ఆర్మీలో దేశ భద్రత కోసం పని చేస్తున్నారు. ఇక్కడివారే కాకుండా నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువత ఆర్మీలో పనిచేస్తున్నారు.
సిరికొండ మండలకేంద్రానికి చెందిన శాగంటి అశోక్-లలిత దంపతుల కొడుకులు సతీశ్, నితీశ్ చిన్ననాటి నుంచే ఆర్మీ అంటే ఇష్టం పెంచుకున్నారు. ఇంటర్ పూర్తయిన వెంటనే సతీశ్ 2015లో ఆదిలాబాద్లో జరిగిన ఆర్మీ ర్యాలీలో ఎంపికయ్యాడు. జమ్మూకశ్మీర్లోని బారాముల్లాలో జనరల్ డ్యూటీ (జీడీ) ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు. తమ్ముడు నితీశ్ 2020లో హైదరాబాద్లో జరిగిన ఆర్మీ ర్యాలీలో ఎంపికయ్యాడు. ప్రస్తుతం బిహార్లో కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దేశం మీద ఇష్టమే తమను ఇక్కడి దాకా నడిపించిందని చెబుతున్నారు.
దేశ సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉంది. చిన్ననాటి నుంచి ఇదే తపన ఉండేది. అదే పట్టుదలతో ఆర్మీలో చేరా. ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. 2021 సంవత్సరంలో ఆర్మీలో చేరే అవకాశం వచ్చింది. ప్రస్తుతం పదోన్నతిపై బిహార్లో కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్న. యువత ఆర్మీలో చేరేందుకు ముందుకు రావాలి.
-దేవరకొండ సాయికృష్ణ, సిరికొండ,ఆర్మీ కమాండర్
2008లో ఆర్మీలో చేరా. దేశం కోసం పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నెలల తరబడి ఇంటికి రాకపోవడం బాధే అయినా, దేశం కోసం తప్పదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఎంసీఏవో అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్నా. అమ్మానాన్నల దీవెనలు మమ్మల్ని నడిపిస్తున్నాయి. దేశ ప్రజలందరి ఆశీస్సులు కూడా మాపై ఉంటాయి.
-ముత్యంపు కృష్ణ, ఆర్మీజవాన్, సిరికొండ
ఆర్మీలో ఉద్యోగం చేయడం ఆనందంగా ఉంది. మాది మారుమూల గిరిజన మండలం. వ్యవసాయ ఆధార కుటుంబాలే ఎక్కువ. మా ఊళ్లోని యువకులు ఆర్మీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు. దాదాపు 30 కుటుంబాల యువకులు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు.
బత్తిని మురళీకృష్ణ,ఆర్మీ జవాన్
దేశసేవచేయడం అంటే ఎంతో ఆనందంగా భావిస్తున్న. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు ఈ ఉద్యోగాన్ని ఎంచుకొని ప్రస్తుతం ఆర్మీజవాన్గా జమ్మూకశ్మీర్లో పనిచేస్తున్నాను. పై అధికారులు,తల్లిదండ్రులు,స్నేహితుల ప్రోత్సాహం మరవలేనిది.
కొంగర్ల రాజు, ఆర్మీ జవాన్