నిర్మల్ టౌన్, అక్టోబర్ 4 : బీసీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బీసీ గురుకులాలను ఏర్పాటు చేయగా.. అన్ని జిల్లాలకు మరో రెండు కేటాయించాలని నిర్ణయించింది. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే ఆరు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాలు ఉన్నాయి. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో బాలబాలికలకు సంబంధించి మొత్తం ఆరు గురుకులాలు ఉండగా..ప్రతి ఏడాది 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో ఆరు గురుకులాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు ప్రకటించడంతో బీసీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు బీసీ గురుకులాలు డిగ్రీ కళాశాలలను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో నిర్మల్కు మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర డిగ్రీ కళాశాలతో పాటు బాలికల గురుకుల ఉన్నత పాఠశాలను కొత్తగా మంజూరు చేసింది.
ఇంగ్లిష్ మీడియంలో విద్య బోధన అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాల్లో ప్రతి సంవత్సరం ప్రవేశం పొందేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి తర్వాత ఇంటర్ విద్యను ఇటీవల ప్రారంభించిన ప్రభుత్వం తాజగా డిగ్రీ విద్యను ప్రారంభించబోతున్నది. ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి)లో మహాత్మా జ్యోతిబా ఫూలే డిగ్రీ కళాశాలను మంత్రి ప్రారంభించనున్నారు. 14న నిర్మల్ మండలం కొండాపూర్లో ఉన్నత పాఠశాలను నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. సారంగాపూర్ మండలం చించోలి(బీ) గ్రామం వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుకూల భవనాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ నెల 10వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. డిగ్రీలో బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్, బీజడ్సీ, ఇతర కోర్సులను నిర్వహించడంతో ఇంగ్లిష్ మీడియంలో బీసీ విద్యార్థులకు ఈ విద్య మరింత అందుబాటులోకి రానుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా బాలుర విభాగంలో ఐదు నుంచి పదో తరగతి వరకు మరో గురుకుల పాఠశాల మంజూరు కావడంతో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.