సమైక్య పాలనలో పడావుబడ్డ భూములు స్వరాష్ట్రంలో పచ్చని పంటపొలాలతో కళకళలాడుతుండగా, జీర్ణించుకోలేని కాంగ్రెస్ కుట్రలకు తెరలేపుతున్నది. మూడు గంటల కరెంట్ అంటూ.. 10 హెచ్పీ మోటర్లంటూ ఆగం చేస్తుండగా, రైతాంగం మండిపడు తున్నది. సాగునీరు, 24 గంటల కరెంట్, రైతుబంధు ఇచ్చి.. ధరణితో భూములకు భద్రత కల్పించి అన్నదాతకు అండగా నిలిస్తే.. ఎన్నికల వేళ వచ్చి పరేషన్ చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కరెంట్పై పూటకో మాట మాట్లాడడం, ధరణిని ఎత్తేస్తామని చెప్పడం, రైతుబంధు దుబారా అనడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ను నమ్మితే కారు చీకట్లేనని.. ధరణి ఎత్తేస్తే భూముల కొట్లాటలు తప్పవని భయపడుతున్నది. ఈ నేపథ్యంలో ఉసురు తీసే ‘హస్తం’ను తగిన గుణపాఠం చెబుతామని.. ఉపాధికి భరోసానిచ్చిన బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలుస్తామని తెగేసి చెబుతున్నది.
ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా..?
కడెం, నవంబర్ 29 : మూడు గంటల కరెంట్తో రైతులకు తిప్పలు తప్పవు. కాంగ్రెసోళ్లు, రేవంత్రెడ్డి అవగాహన లేని మాటలతో ఆగం చేస్తున్నరు. మరోసారి మోసం చేయాలని చూస్తున్నరు. ఇప్పటికే పదకొండు సార్లు అవకాశమిచ్చినప్పుడే వారు ఏమి చేయలేక పోయారు. గిప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని వస్తున్నరు. ఆ మాత్రం తెలియని పార్టీని రైతులు, ప్రజలు గెలిపిస్తే ఢిల్లీ వాళ్లు చెప్పిన మాటలు వింటూ మన రైతులను ఇరుకున పెడతరు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకొని మూడు గంటల కరెంట్తో వ్యవసాయం చేయడం నేను ఎక్కడా చూడలేదు. అలా చేస్తే ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా? తీగలు ఉంటయా? మా చేలు, పొలాలు పారుతయా? అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచుతది.
– సంగ పోశన్న, రైతు, పెద్దూర్, కడెం మండలం.
ఇప్పుడు కరెంటుకు ఢోకా లేదు
కౌటాల, నవంబర్ 29 : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరంటుతో రందిలేకుంట ఎవుసం చేసుకుంటున్నం. కాంగిరేసోడు మూడు గంటల కరంటు ఇస్తమంటుండు. మూడు గంటల కరంటుతో మూలకూడ తడువదు. ఎవుసం బంద్ చేసుకోవాల్సిందే. గప్పటి సర్కారు వాళ్లు ఇచ్చిన కరంటుతో ఎన్నో తిప్పలపడ్డం. కరంటు కోసం రాత్రీ పగలు పొలాల దగ్గర పండుకోవాల్సి వచ్చేది. కేసీఆర్ సీఎం అయినంక మా బాధలన్నీ పోయినయ్. తిప్పలు లేకుండా పంటలు పండిస్తున్నం. మూడు గంటల కరంటు ఇచ్చే కాంగిరేసోళ్లు మాకు వద్దు. రైతు క్షేమం కోసం ఎల్లకాలం తిప్పలవడుతున్న కేసీఆరే మాకు ముద్దు. కారు గుర్తుకు ఓటు వేస్తం.
– హుల్కే జుంగా, గుండాయిపేట
10 హెపీ మోటర్లు పెడితే నాశనమే..
కౌటాల, నవంబర్ 29 : తెలంగాణ సర్కారోళ్లు ఇస్తున్న 24 గంటల కరెంట్తో రంది లేకుంట ఎవుసం చేసుకుం టున్నం. 3,5 హెచ్పీ మోటర్లు సక్కగా నడుస్తున్నయి. పంటకు సరిపడా నీళ్లందుతున్నాయి. ఒకవేళ ఈ మోటర్లు కాలిపోయినా రిపేర్కు రూ. ఐదారు వేలల్లోనే అయితది. అదే కొత్తగా 10 హెచ్పీ మోటర్ పెట్టుకుంటే రూ. లక్షదాకా ఖర్చు పెట్టాల్సి వస్తది. రిపేర్కు పోతే రూ. 20 వేల దాకా అయితయి. గా మోటర్ వాడితే బావుల్లో నీళ్లింకిపోతయి. ఒకేసారి అందరూ మోటర్లు వేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయ్. అసలు ఆ అవసరం ఏమొచ్చింది. ఉన్నది పోగట్టి.. మమ్ముల నాశనం చేద్దామని చూస్తున్న కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెబుతాం.
– కోవ చరణ్దాస్, హెట్టి
మళ్లీ రోడ్డెక్కాల్సి వస్తది..
దిలావర్పూర్, నవంబర్ 29 : సీఎం కేసీఆర్ సారు ధరణిని తీసుకొచ్చిన తర్వాత డిజిటల్ రికార్డులు బాగున్నాయి. మా భూములు ఎక్కడున్నయో సులువుగా తెలుసుకో గలుగుతున్నాం. రైతులకు సంబంధించిన భూమి విస్తీర్ణం ఎవరికీ ఎంత ఉందో తెలుస్తున్నది. దీనిద్వారా ఎరువులు, విత్తనాలు కూడా రైతుల దరి చేరుతున్నాయి. గత కాంగ్రెస్ పాలనతో రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఎరువులు, విత్తనాలు సక్రమంగా వచ్చేవి కాదు. అందరికీ చేరేవి కాదు. దీంతో పొద్దంతా, రాత్రంగా పీఏసీఎస్, ఎరువులు, మందుల దుకాణాల వద్ద పడిగాపులు కాసేవాళ్లం. పిల్లాపాపలతో జాగారం చేసేవాళ్లం. ఎడ్లబండ్లు, మోటార్ సైకిళ్లపై వచ్చి పొలం పనులు వదులుకొని పాదరక్షలు క్యూగా పెట్టే వాళ్లం. దొరుకక పోతే ధర్నాలు, రాస్తారోకోలు చేసేవాళ్లం. గిప్పుడు ఆ బాధలు అన్ని తప్పినయ్. ధరణి కచ్చితంగా ఉండాల్సిందే. కాంగ్రెస్ వాళ్లు గెలువనే లేదు. రైతులపై గిన్ని కుట్రలు చేస్తున్నరు. వారికి అవకాశం ఇస్తే రోడ్డున పడాల్సిందే.
– హుస్సేన్, రైతు, లోలం గ్రామం, దిలావర్పూర్ మండలం.
ధరణి మంచిగున్నది
కౌటాల, నవంబర్ 29 : ధరణి వచ్చినంక మంచిగున్నది. మాకు పాసు పుస్తకం వచ్చింది. మా భూములకు మంచి రికార్డు తయారు చేసిన్రు. ఇంతకు మునుపు ఏదైనా పని కావాలంటే ఎమ్మారోవ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగీ గోస పడేటోళ్లం. కానీ ఇప్పుడు ఎలాంటి బాధల్లేకుంట అయినయి. ఇప్పుడు ఏం కావాలన్న ఫోన్ల అన్నీ చూసుకుంటున్నం. అట్లనే పహానీ కావాలన్న కూడా మీ సేవకు పోకుండానే ఎక్కడైనా తీసుకుంటున్నాం. భూమిలు అమ్మినా.. కొన్నా.. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే నిమిషాల్లో పని అయితంది. అదే అప్పుడు అయితే రోజుల తరబడి తిరుగుడు, మధ్యవర్తులకు పైసలిచ్చుడు, గోస గోస ఉంటుండే. ఇప్పుడు మధ్యవర్తుల బాధలేదు, పైసలు ఇచ్చే బాధలేదు. అన్ని సక్కగా ఆన్లైన్ లో నిమిషాల్లో అయితన్నయి. అప్పుడు ఎవరి భూమి ఎవరు రాసుకునేటోళ్లో తెల్వకపోతుండే. కానీ ఇప్పుడు ఎవరి భూమి ఎవరు తీసుకునే అవకాశమే లేదు. ఇంత సౌలత్ ఉన్న ధరణిని కాంగ్రెస్ నాయకులు రద్దు చేస్తామనడం వాళ్ల మూర్ఖత్వం. అందుకే తెలంగాణ సర్కారే ఉండాలి.
– కుత్తరమారె శివరాం, గుండాయిపేట
ధరణి తీసేస్తే బతుకులు ఆగమే..
మందమర్రి రూరల్, నవంబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని తీసేసి దళారుల రాజ్యం తీసుకొచ్చి దోపిడీ చేయాలని చూస్తోంది. ధరణి వచ్చాకే మా భూములు ఇతరులు పేర బదలాయింపు చేయకుండా భద్రత వచ్చింది. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థతో కూడిన రెవెన్యూ విధానం ఉండడం వల్ల రైతులు అనేక కష్టాలు పడ్డరు. వారికి తెలియకుండానే రికార్డుల్లో పేరు మార్పిడి చేసే వారు. దీంతో రైతు తన పేరు మార్పు చేసుకోవడానికి పటేల్, పట్వారీ,తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేటోళ్లు. రెవెన్యూ వ్యవస్థ ఉన్న సమయంలో బలం ఉన్నోనిదే రాజ్యం. అనుభవదారు కాలం పెడితే రైతులు ఎవరికీ తమ పొలాన్ని కౌలుకు ఇచ్చే పరిస్థితి ఉండదు. రెవెన్యూ రికార్డుల్లో కౌలుదారు,అనుభవ దారు కాలం పెడతామని కాంగ్రెస్ అంటుంది. అసలు వారు మతి ఉండే మాట్లాడుతున్నారా. పాతకాలం చట్టాలను పట్టుకొని ఆ పార్టీ వేలాడుతుంది. ధరణి వచ్చిన తర్వాత రైతుల భూములకు భద్రత ఏర్పడింది. మళ్లీ పాతవిధానం తెస్తే రైతుల మధ్య గొడవలు జరగడంతో పాటు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తది. కాంగ్రెసోళ్లు సోయి తప్పి మాట్లాడుతున్నరు.
-యాదగిరి మల్లేశ్, సారంగపల్లి,మందమర్రి మండలం
భూములకు రక్షణ ఉండదు..
సొనాల, నవంబర్ 29 : ధరణి ఉంటే కాంగ్రెసోళ్లకు ఏం నష్టం. ఎందుకు తీసేయాలని చూస్తున్నరు. ధరణితోనే భూములకు రక్షణ కలిగింది. గుండెలపై నిశ్చింతగా చేతులు వేసుకొని నిద్రపోతున్నం. మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తే లంచగొండులు, దళారులు పుట్టుకొస్తరు. ఏం పని కావాలన్నా కార్యాలయాల చుట్టూ ఏండ్ల తరబడి తిరగాల్సి వస్తది. డబ్బులు ఇవ్వందే ఏం పని కూడా కాదు. గిప్పుడు మా భూములకు భద్రత ఉంది. డిజిటలైజేషన్ కావడంతో ఏవరి భూమి అయితే ఉంటదో వారి వేలి ముద్ర వేస్తే తప్పా రికార్డులు మారవు. ఇంత మంచి పోర్టల్ను రద్దు చేస్తామని చెప్పడం కాంగ్రెసోళ్లకు తగదు.
– బొడ్డు శ్రీకర్, రైతు, సొనాల మండలం.
మళ్లా దుబాయి..బొంబాయి బతుకపోవుడే..
లక్షెట్టిపేట, నవంబర్ 29 : ఎవుసానికి 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడం ఎంత విడ్డూరంగా అనిపిస్తుందంటే అసలు తెలివి ఉండి మాట్లాడుతున్నాడా లేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడా రేవంత్రెడ్డి అర్థం అయితలేదు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే పంటలు మొత్తం ఎండిపోతాయి, భూములు మొత్తం బీడు వడుతై. మూడు గంటల కరెంట్ ఇస్తే ఒక్క మడి కూడా తడువది ఉన్న పొలం మొత్తం ఎండిపోతది. ఒక ఏడాది చూసి రైతులు వ్యవసాయం చేసుడు పక్కకు పెట్టి భూమిని బీడుగా ఉంచి మళ్లీ కూలీ నాలీ చేసుకునేందుకు దుబాయి& బొంబాయి బాట పడుతడు. ఆడు ఇచ్చే 3 గంటల కరెంట్కు 10 హెచ్పీ మోటర్ పెట్టుకోమంటుండ్రు అసలు ఆ మోటర్ పెట్టుకుంటే బాయిల నీళ్లు ఉంటాయా, ఒకవేళ రైతులు పెట్టుకుంటే పది మంది రైతులు ఒక్కసారి మోటర్ చాలు చేస్తే ట్రాన్స్ఫార్మర్ ఆపుతదా, రైతులు ఆ మోటర్ పెట్టి బువ్వ తినడానికి పోయి వచ్చే సరికి బాయిల నీళ్లు ఒడిసి మోటర్ కూడా కాలిపోతది. అప్పుడు దాన్ని చేపియ్యాలంటే ఎన్ని పైసలు అయితయ్ సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం రైతులు సంతోషంగా ఉంటరు అందుకే ఈసారి కూడా సీఎం కేసీఆర్నే గెలిపించుకుంటాం. కారు గుర్తుకే ఓటు వేస్తాం.
-చొప్పదండి సత్తయ్య, రైతు, రంగపేట
10 హెచ్పీ మోటర్లు కాలుతాయ్..
దండేపల్లి, నవంబర్ 29 : కాంగ్రెస్ నాయకులు 10హెచ్పీ మోటర్లతో 3 గంటల కరెంటు చాలు అంటున్నారు. 10 హెచ్పీ మోటర్లను బోర్లను బావిలో దించితే నీళ్లను ఒక్కసారిగా గుంజుతయి. ఆ తర్వాత మోటర్ పంపులో నీళ్లు అందక మోటర్లు కాలుతయ్. ఎవుసం తెలియని నాయకులు మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రేసోళ్ల మాటలకు రైతులు ఆందోళన చెందుతున్నరు. 3 గంటల కరెంటుతో 10హెచ్పీ మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్లు ఆగుతయా..? కాంగ్రేసోళ్లకు ఎవుసం గురించి ఏమైనా తెలుసా..? వీళ్లు మాట్లాడుతున్న మాటలకు వాళ్లకు ఓటు ఎవరూ వేయరు. ఎవుసాన్ని పండుగ చేసిన సీఎం సారును మేం మరువం. మళ్లా గెలిపిస్తాం.
-ముచ్చర్ల పోచయ్య, రైతు, నంబాల
గింత మంచి ధరణిని తీసేస్తరట
కౌటాల, నవంబర్ 29 : తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి రైతులకు మేలు చేసింది. భూముల లెక్కలన్నీ సక్కగా చేసింది. అంతకుముందు ఎవరి భూమి ఎవరి పేరు మీదికి మార్చేటోళ్లో తెలిసేది కాదు. ఏదైనా పనిపడి ఆఫీస్లకు పోతే తిప్పుకొని సంపేటోళ్లు. లంచం ఇస్తేగాని పనిచేసేటోళ్లు కాదు. గదే ధరణితో ఎవ్వరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని మరుసటి రోజు పోతే.. రిజిస్ట్రేషన్ అయిపోతంది. గింత మంచి ధరణిని కాంగ్రెసోళ్లు తీసేస్తమని చెబుతున్రు. గాళ్లను నమ్మితే మళ్లా పట్వారీల వ్యవస్థ వస్తది. రైతుల బతుకులు మళ్లా ఆగమైతయ్.
– పోరెత్ రమేశ్, జనగాం
కాంగ్రెసోళ్లను నమ్మితే మళ్లా అప్పులే…
కౌటాల, నవంబర్ 29 : కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి మూడు గంటల కరెంటుచా లం టున్నరు. గా మూడు గంటలతో పంటలు పండుతయా. రైతులు మంచిగా బతుకుడు కాంగ్రె సోళ్లకు ఏమాత్రం నచ్చుతలేదేమో. గతంలోనే పంటలు పండక అష్టకష్టాలు పడ్డం. తెలంగాణ వచ్చి.. కేసీఆర్సీఎం అయినంక రైతుల బాధలు తీర్చిండు. ఎవుసానికి 24 గంటల కరెంటిస్తు న్నడు. నచ్చినప్పుడు నీళ్లు పెట్టుకుంటున్నం. రంది లేకుంట పంటలేసుకుంటున్నం. ఈ సారి నేను మిరప సాగు చేస్తున్న. పంట మంచిగుంది. కాంగ్రెసోళ్లను నమ్మి బాధపడ్డది చాలు.. వాళ్లు మాకు అవసరమే లేదు. గాళ్ల పాటలు పట్టుకుంటే మళ్లా అప్పుల పాలవుడే.
– రోహిణే ప్రభాకర్, తాటిపల్లి
ఘర్షణలు, గొడవలు తలెత్తుతాయి..
ఇంద్రవెల్లి, నవంబర్ 29 : కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ను ఎత్తేస్తమంటున్నరు. దీనిస్థానంలో భూమాత తీసుకొస్తమంటున్నరు. ఇప్పటికే వారి హయాంలో పటేల్, పట్వారీ వ్యవస్థతో అవస్థలు పడ్డం. పల్లెల్లో ఘర్షణలు, గొడవలు జరిగేవి. చేతిరాత ద్వారా రికార్డులు ఉండడంతో భూములు తారుమారు అయ్యేవి. వీటన్నింటికి కేసీఆర్ సారు ధరణి పోర్టల్ తీసుకొచ్చి పరిష్కారం చూపారు. ఏ రిజిస్ట్రేషన్ అయినా అరగంటలో పూర్తవుతున్నది. అన్ని రికార్డులు కూడా డిజిటల్ రూపంలో ఉన్నాయి. ఫలితంగా మనం ఎక్కడ ఉన్నా మన భూమిని మొబైల్లో చూసుకునే వెసులుబాటు ఉంటున్నది. భూములు వివరాలు ఆన్లైన్లో ఉండడంతో ఎరువులు, విత్తనాలు కూడా రైతులకు సులువుగా అందించడానికి వీలుంటున్నది. రైతుబంధు, రైతుబీమా డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లో పడిపోతున్నాయి. ఇంతమంచి ధరణిని రద్దు చేయడం తగదు.
– సోయం భీంరావ్, రైతు, సమక, ఇంద్రవెల్లి మండలం.
3 హెచ్పీకే ఇయ్యలేదు.. 10 హెచ్పీకి ఎలా ఇస్తరు..
దిలావర్పూర్, నవంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ పాలనలో 3 హెచ్పీ మోటర్లకే కరెంట్ సక్కగ ఇయ్యలేదు. గిప్పుడు 3 గంటల కరెంటిచ్చి 10 హెచ్పీ మోటర్లు నడుపమంటే ఎలా నమ్మేది. నాడు ఎండాకాలం వచ్చిందంటే చేతికందే దశలో ఉన్న నువ్వు, సజ్జ, జొన్న పంటలు కరెంట్ లేక వట్టి పోయిన రోజులు గుర్తు కొస్తున్నయ్. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతది. 10 హెచ్పీ మోటర్లు వాడుమని అంటున్నడు. అది ఏలా సాధ్యమో ముందుగా రైతులు చెప్పాలి. మోటర్లు కాలిపోయి, ట్రాన్స్పార్మర్లు పేలిపోతాయి. ఆ పార్టీల నాయకులకు రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం ఇష్టం లేదు. 24 గంటల కరెంటిచ్చే కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ రావాలి.
– ముత్యం, రైతు, లోలం గ్రామం, దిలావర్పూర్ మండలం.
మూడు గంటల కరెంటుతో మడి కూడా తడువదు..
ఇంద్రవెల్లి, నవంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా తడువదు. గతంలో కాంగ్రెసోళ్లు నాలుగు గంటలు ఇస్తేనే పంటలు ఎండిపోయినవి. ఇప్పుడు మూడు గంటలు ఇస్తామని ముందుకొచ్చారు. వారి అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు నష్టపోవడం మినహా ఏమి లేదు. మళ్లీ మేము కష్టపడడానికి, నష్టపోవడానికి సిద్ధంగా లేము. సీఎం కేసీఆర్ సారు ఇస్తున్న 24 గంటల కరెంటుతో సాగు పండుగలా మారింది. ఎప్పుడంటే అప్పుడు మోటర్లు ఆన్ చేసుకుంటున్నం. ఇగ, కాంగ్రెస్ నాయకులు 10 హెచ్పీ మోటర్లు కూడా పెట్టుకోమంటున్నరు. ఇప్పటికే 3,5 హెచ్పీ మోటర్లు వాడుతున్నం. వాటిని తుక్కుకు వేయడం తప్పితే ఏం లాభం లేదు. ఇప్పుడు 10 హెచ్పీ మోటర్లు కొనాలంటే లక్ష రూపాయలు అవుతాయి. ఆ డబ్బులు కాంగ్రెస్ నాయకులు ఇస్తరా. కాంగ్రెస్ వచ్చేది లేదు. సచ్చేది లేదు.
– పవార్ కామాజీ, రైతు, మచ్చాపూర్, ఇంద్రవెల్లి మండలం.
జనరేటర్లు తెచ్చుకోవాల్సి వస్తది..
సొనాల, నవంబర్ 29 : కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటిస్తమంటున్నరు. మూడు గంటల కరెంటుతో నీరు పారదు. పారినా పొలం తడిచిన చోటే తడుస్తది. మిగతా పొలం అంతా వట్టిపోతది. ఇగ, డీజిల్ ఇంజిన్లు, జనరేటర్లు కొనుక్కోవాల్సి వస్తది. వీటికి అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. వీటి రిపేర్లకు కూడా డబ్బులు బాగానే అవుతాయి. ఇంకా, కాంగ్రెస్ నాయకులు ఇంకా, 10 హెచ్పీ మోటరు కొనుక్కోవాలని చెబుతున్నరు. వీటన్నింటికి డబ్బులు ఎవరిస్తరు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు ఇచ్చే 24 గంటల కరెంటే బాగున్నది. కరెంటు నిత్యం ఉండడంతో మా వీలున్న సమయంలో నీటి పారకం పెడుతున్నాము. ఈ పద్ధతే బాగుంది. కేసీఆర్ సారుకే మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. కాంగ్రెస్కు అవకాశం ఇస్తే కరెంటు ఇచ్చేది తెల్వదు, ఇవ్వంది తెల్వదు.
– తుల గణేశ్, యువ రైతు, సొనాల మండలం
మూలకూడా తడవదు
దండేపల్లి, నవంబర్ 29 : ఎన్నికల ముందు 3 గంటల కరెంటు అంటూ మోసం చేయడానికి వస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నరు. మూడు గంటల కరెంట్ అంటే రైతులు ఆగం కావడం ఖాయం. మూడు గంటల కరెంటుతో ఒక్క మూల కూడా తడువదు. గతంలో వచ్చీరాని కరెంటుతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం.10 హెచ్పీ మోటర్లు అంటున్నరు. దాని ఖర్చు ఎవ్వరూ భరించాలే. 10 హెచ్పీ మోటర్లు బిగిస్తే బోర్లలో ఊట తగ్గుతది. మోటర్లు మోతాదుల పోస్తేనే వచ్చే ఊటను చాలా సమయం వరకు నీరు వచ్చి పాలం పారుతది. కూరగాయల పంట సాగు చేస్తుంటాం. 5 హెచ్పీ మోటర్ సరిపోతుంది.
-ఉప్పులపాటి కిషోర్, తానిమడుగు.
భూముల జోలికి వస్తే ఊరుకోం..
దండేపల్లి, నవంబర్29: భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇష్టం వచ్చినట్లు చేయాలని కాంగ్రేసోల్లు చూస్తున్నరు. కేసీఆర్ వచ్చినంక ఎక్కడ భూముల పంచాయతీ లేదు. పైరవీ కారుల అవసరం లేదు. భూముల లొల్లులతో కుటుంబాలు విడిపో వడవం లేదు. ఇవన్నీ సరిదిద్దడానికి సీఎం సారు ధరణి తీసుకువచ్చిం డు. కాంగ్రెస్ నాయకులు రాగానే ధరణి తీసేస్తాం అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న రైతుల కుటుంబాల్లో మళ్లీ గొడవలు కావాలని చూస్తారా.. కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీకారులు పుట్టుకొచ్చి రైతుల రక్తం తాగుతరు. మళ్లా కేసీఆర్ రావాలే. ఇప్పుడున్న రైతుల పథకాలు అన్ని ఉండాలే. రైతులందరూ సీఎం సారుకు అండగా ఉండాలే.
-మన్నే రాజలింగు, రైతు, నంబాల