భైంసా, నవంబర్ 20 : అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలన్నీ ఇక నుంచి కాగిత రహితం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందించింది. అందులోనే ప్రత్యేక యాప్ రూపొందించింది. దీనిపై ఐసీడీఎస్ పర్యవేక్షకులు ఎంపిక చేసిన అంగన్వాడీ టీచర్లకు ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా ఈ నెల 9,10,11 తేదీల్లో శిక్షణ ఇచ్చారు. ఐసీడీఎస్ ద్వారా చేపట్టే కార్యక్రమాలు, కేంద్రాల నిర్వహణ అంతా యాప్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ నుంచి పూర్తిస్థాయి నియోగంలోకి వస్తుందని సీడీపీవో నాగలక్ష్మి పేర్కొన్నారు.
14 రకాల దస్ర్తాల నమోదుకు చెక్ ..
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముథోల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 8 కేంద్రాలున్నాయి. 205 అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. 11,357 మంది చిన్నారులు చదువుతున్నారు. 1,308 మంది గర్భిణులు, 9,052 మంది బాలింతలు లబ్ధిదారులుగా నమోదై ఉన్నారు. ప్రస్తుతం ప్రతీ కేంద్రంలో రోజూ వచ్చే లబ్ధిదారుల వివరాలతో పాటు, వస్తున్న సరుకులు, వినియోగం, తదితర అంశాలను 14 రకాల రిజిస్ట్రర్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అంగన్వాడీ టీచర్లు అత్యధిక సమయం వీటికే కేటాయిస్తున్నారు. దీంతో రావడంతోనే పిల్లలకు ఆట పాటల ద్వారా నేర్పించాల్సిన విద్య అటకెక్కుతున్నది. దీనిని గుర్తించే రికార్డులు రాసే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు.
ఇప్పటికే శిక్షణ పూర్తి..
రికార్డులకు సంబంధించిన అన్ని అంశాలతో ఎన్హెచ్టీఎస్ 9 (న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్) పేరుతో యాప్ను రూపొందించారు. ఇందులో 9 రికార్డులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరిచారు. మిగిలిన వాటి సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. దీన్ని ఎలా వినియోగించాలనే విషయమై మూడురోజుల శిక్షణ పొందిన సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. భవిష్యత్లో బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పౌష్టికాహారం సరఫరా అయ్యే అవకాశం ఉంది.
డిసెంబర్ నుంచి అమలు..
వచ్చే నెల డిసెంబర్ నుంచి ఈ యాప్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుంది. ఇక నుంచి రోజువారీ హాజరు అందించే పౌష్టికాహారం తదితర అంశాలను ఈ యాప్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా అక్రమాలకు తావుండదు. టీచర్లకు కూడా రికార్డులు రాసే కష్టాలు తప్పుతాయి.
– నాగలక్ష్మి, సీడీపీవో