నార్నూర్, డిసెంబర్ 1 : చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటతో విద్యాబుద్ధులు చెప్పేందుకు అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. కానీ పౌష్టికాహార లోపం చిన్నారుల ఎదుగుదలకు అవరోధంగా మారుతున్నది. ఇది భవిష్యత్పై తీవ్రప్రభావం చూపుతున్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేసున్నాయి. తద్వారా బాల్యాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అంగన్వాడీ వ్యవస్థ మరింత బలోపేతం చేసేలా న్యూటిషన్ అండ్ హెల్త్ ట్రాడింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్) యాప్ అమలుకు శ్రీకారం చుట్టుంది.
నార్నూర్, గాదిగూడ మండలంలో 48 గ్రామ పంచాయతీలున్నాయి. ఉమ్మడి మండలం మొత్తంలో 154 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో ప్రధానమైనవి – 103, మినీ అంగన్వాడీ కేంద్రాలు – 51 ఉన్నాయి. ఇందులో 0 నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలు 4068 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలి కలకు ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల పూర్తిస్థాయి పర్యవేక్షణకు ఎన్హెచ్టీఎస్ యాప్ను అమలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు ఈ యాప్పై శిక్షణనిచ్చారు. వీటిలో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నా.. కొందరిలో లోపం కనిపిస్తున్నది. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదని అధికారులు గుర్తించారు. పౌష్టికాహార లోపమున్న చిన్నారులకు బలవర్థకమైన బాలామృతంతోపాటు పౌడర్ను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎన్హెచ్టీఎస్ యాప్లో అంగన్వాడీ టీచర్ల హాజరు, చిన్నారుల పెరుగుదల పర్యవేక్షణ, ఆహార నిల్వలు, గర్భిణుల వివరాలు, టీకాలు వేసే సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్లో అంగన్వాడీల సమగ్ర వివరాలు ఉండడంతో చిన్నారులకు వందశాతం పౌష్టికాహారం సక్రమంగా అందడం, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడడానికి దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడానికి అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. సరైన క్రమంలో పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు మరింత పారదర్శకంగా ఉండాలని ఎన్హెచ్టీఎస్ యాప్ అమలుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అంగన్వాడీ టీచర్లకు మొబైల్యాప్పై శిక్షణనిచ్చాం. బాల్యం బలంగా ఉంటే భవిష్యత్ బాగుంటుంది.
– శారద, సీడీపీవో, ఐసీడీఎస్, ఉమ్మడి మండలం