ఎదులాపురం, ఆగస్టు 20 : సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సుభాష్నగర్కు చెందిన యువత దీక్షలో పాల్గొనగా జోగు రామన్న శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పునఃప్రారంభం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం టాస్ అధ్యయన కేంద్రంలో సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జస్టిస్ చంద్రకుమార్, జాన్ వెస్లీ, మాజీ ఎంపీ వినోద్, సీపీఎం, న్యూ డెమోక్రసీ నేతలు గోవర్ధన్, నంది రామయ్య, ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన భోజారెడ్డి హాజరవుతారని తెలిపారు. సీసీఐ పునఃప్రారంభంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దీక్షలో అన్నెల వసంత్, ముకుల నరేష్, దికొండ అశోక్, శేఖర్, షేక్ సలీం, వంశీ, వీలీన్, రాహుల్, ఉషారెడ్డి, దస్తగిరి, సందీప్తోపాటు కమిటీ సభ్యులు యూనిస్ అక్బాని, ఇజ్జగిరి నారాయణ, కొండ రమేష్, లోకారి పోశెట్టి, వెంకట్ నారాయణ, ఈశ్వర్దాస్, జై సింగ్ తదితరులు పాల్గొన్నారు.