మంచిర్యాల కొత్త కలెక్టరేట్లో ఔట్సోరింగ్ ఉద్యోగాల పేరిట లక్షలు దండుకున్న అక్షర ఏజెన్సీ వ్యవహారం ముదురుతున్నది. మొదట బెల్లంపల్లికి చెందిన భీమ్ ఎస్సీ, ఎస్టీ సోషల్ వెల్ఫేర్ సొసైటీకి కాంట్రాక్టు అలాట్ చేయగా, ఆ తర్వాత బదిలీపై వచ్చిన కొందరు అధికారులు ఉన్నఫలంగా ‘అక్షర’కు అప్పగించడంతో అక్రమాలకు తావిచ్చినైట్లెంది. అగ్రిమెంట్ ప్రకారం 11 మందిని నియమించాల్సి ఉండగా, సదరు ఏజెన్సీ ఉద్యోగాలిచ్చి.. పర్మినెంట్ చేస్తామంటూ ఏకంగా 23 మందిని నియమించి లక్షల్లో వసూళ్లకు పాల్పడింది. చివరకు బాధితులంతా ప్రజావాణిని ఆశ్రయించగా, యంత్రాంగం ఏజెన్సీని మార్చే పనిలో నిమగ్నమైంది. కాగా, ఆ 23 మందిని కొనసాగిస్తారా.. వారికివ్వాల్సిన వేతనాలిస్తారా..? వసూలు చేసిన లక్షలాది రూపాయల మాటేమిటి.. అన్నదానిపై స్పష్టత కరువైంది.
– మంచిర్యాల, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కొత్త కలెక్టరేట్లో ఔట్సోరింగ్స్ ఉద్యోగాల పేరిట లక్షలు దండుకున్న ఏజెన్సీ అసలు కథ బట్టబయలవుతుంది. గార్డెనింగ్, సెక్యూరిటీ గార్డు, స్కావెంజర్స్, స్వీపర్స్గా ఉద్యోగాలు ఇప్పించి, జీతాలు ఇవ్వకుండా మోసం చేశారంటూ బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, ఈ నెల 15న నమస్తే తెలంగాణ ‘ఔట్ సోర్సింగ్ పేరిట మోసం’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో మరి కొంతమంది ‘నమస్తే తెలంగాణ’తో తమ గోడును వెల్లబోసుకున్నారు.
ఆ వివరాలు ఇలా.. మంచిర్యాల కలెక్టరేట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కాంట్రాక్టును ముందు బెల్లంపల్లికి చెందిన భీమ్ ఎస్సీ అండ్ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించారు. ఈ మేరకు ఇప్పుడున్న కలెక్టరే 07-07-2023 రోజున అలాట్మెంట్ లెటర్ సైతం ఇచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన వరదలతో కొంత జాప్యం జరిగింది. అప్పుడే జిల్లా అధికారుల బదిలీలు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఇద్దరు అధికారులు అక్షర ఏజెన్సీ.. రూ.1.10 లక్షలకు కాంట్రాక్టు చేయడానికి ముందుకు వచ్చిందని చెప్పి.. తక్కువ డబ్బులకే పని చేస్తానంటున్నదని కాంట్రాక్ట్ను ఉన్న ఫలంగా అప్పగించేశారు.
కలెక్టరేట్ అధికారులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో 11 మందిని నియమించుకునేందుకు అక్షర ఏజెన్సీకి అగ్రిమెంట్ చేసినట్లు సమాచారం. కాగా.. ఏజెన్సీ వాళ్లు ఏకంగా 23 మందిని నియమించారు. ఈ మేరకు ఒకొక్కరి దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు తెరలేపారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఆరుగురు ఉద్యోగులు ఒకొక్కరి నుంచి రూ.50 వేల చొప్పున రూ.3 లక్షలు తీసుకుంటే.. మిగిలిన వారందరి దగ్గర కలిపి దాదాపు మరో రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక సమాచారం.
నెలకు రూ.10 వేల జీతం వచ్చే పనికి రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేశారని తెలిసి అధికారులే నివ్వెరపోతున్నారు. ఇదే అక్షర ఏజెన్సీ గతంలోనూ ఇలాంటి అక్రమాలు చేసినట్లు నమస్తే తెలంగాణ ఎంక్వైరీలో తేలిసింది. ఆదిలాబాద్ బీసీ వెల్ఫేర్శాఖ ఆధీనంలోని పోస్టుమెట్రిక్ హాస్టల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టి ఆరునెలలు ఎవరికీ వేతనాలు ఇవ్వకుండా రూ.16 లక్షల మోసం చేసింది ఈ అక్షర ఏజెన్సీయేనని తెలిసింది.
ఈ విషయాలేవీ పరిశీలించకుండానే ఆ ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించడం.. కలెక్టర్ అలాట్మెంట్ను పక్కనపెట్టి మరీ ఇలా చేయడం ఏమిటనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ముందే సరిగా చేయకుండా.. ఇప్పుడు విషయం బయటికి రావడంతో సదరు ఏజెన్సీని తొలగించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అక్షరపై క్రిమినల్ కేసు సైతం పెట్టనున్నట్లు ఓ అధికారి తెలిపారు. కాగా అదే జరిగితే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న 23 మందిని కొనసాగిస్తారా.. వారికి రావాల్సిన వేతనాన్ని చెల్లిస్తారా.. వాళ్ల దగ్గర వసూలు చేసిన లక్షలాది రూపాయాల మాటేంటి… అసలు ఈ 23 మందిలో కొందరికి పూర్తిస్థాయి జీతాలు ఇచ్చామని సదరు ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత.. అసలు ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఏం జరిగింది అనేది ప్రశ్నార్థకంగా మారింది.
వాస్తవానికి కలెక్టరేట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం నెలకు రూ.2 లక్షలపైనే అవసరమవుతాయి. పాత లెక్కల ప్రకారం నలుగురు సెక్యూరిటీ, ఒక సూపర్వైజర్, నలుగురు గార్డెనింగ్, ముగ్గురు స్కావెంజర్లు, ఏడుగురు స్వీపర్స్తో కలిసి మొత్తం 19 మంది అవసరం. బెల్లంపల్లి ఏజెన్సీకి అధికారులు అలాట్మెంట్ ఇచ్చినప్పుడు ఉన్న లెక్క ఇది. కానీ కొత్తగా వచ్చిన అధికారులు 11 మందికి రూ.1.10 లక్షలు ఇస్తే అయిపోతుందని చెప్పి మన జిల్లాతో ఎలాంటి సంబంధం లేని కరీంనగర్కు చెందిన ఏజెన్సీకి బాధత్యలు అప్పగించడం వెనుక మతలబేంటి అనేది చర్చనీయాంగా మారింది.
నెలకు రూ.10 వేల జీతం ఇచ్చినా 11 మందికి రూ.1.10 లక్షలు అవుతాయి. మరి వారికి పీఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కలిపితే మరింత అవసరం అవుతాయి. ఇవన్నీ తెలిసిన అధికారులు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారనేది అర్థం కావడం లేదు. జిల్లా స్థాయిలో ఓ పెద్ద అధికారి సహా మరో అధికారికి భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని.. అందుకే అక్షర ఏజెన్సీని ఎంపిక చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.