మంచిర్యాల, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల మున్సిపాలిటీలో గతంలో కమిషనర్గా పనిచేసిన బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కమిషనర్ రూ.15 లక్షలు తీసుకున్నాడంటూ అమరగాని రమేశ్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్.. కమిషనర్పై వస్తున్న ఆరోపణలపై విజిలెన్స్కు లేఖ రాస్తానని, డబ్బులు తీసుకున్న అటెండర్ విషయంలో నూ విచారణ చేయాలని ప్రస్తుతం ఉన్న కమిషనర్ను ఆదేశిస్తామని చెప్పారు. కాగా, తనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలుసుకున్న పాత కమిషనర్ బాలకృష్ణ గురువారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
అప్పటికీ చైర్మన్ రాకపోవడంతో దాదాపు గంటపాటు ఎదురుచూశారు. చైర్మన్ వచ్చాక.. అవిశ్వాస తీర్మాన సమయం లో రోజూ సలహాలు తీసుకునేందుకు ఫోన్ చేసిన మీరు, ఎవరో వచ్చి నాకు రూ.15 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదు చేస్తే ఎలా తీసుకున్నారంటూ కమిషనర్ బాలకృష్ణ ప్రశ్నించారు. ఒక్కమాట తన దృష్టికి తీసుకువస్తే అప్పుడే ఏదో ఒక క్లారిఫికేషన్ ఇచ్చేవాడినని, అలా చేయకుండా మీడియా వాళ్లకు చెప్పేంత పెద్ద విషయం ఏముందో చెప్పాలని కోరారు.
నేను కూడా వాళ్లకో రూ.5 లక్షలు, వీళ్లకో రూ.3 లక్షలు ఇచ్చానని ఫిర్యాదు చేస్తే.. ఇలాగే చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరు ఫిర్యాదు చేశారో కానీ.. తనకు ఎండార్స్ చేసి ఇవ్వాలని, అలాగే ఆరోపణలు చేసిన వారిని పిలిపించి రుజువు చేయించాలని కమిషనర్ పట్టుబట్టారు. రుజువు చేస్తే ఇప్పుడే రూ.15 లక్షలు ఇచ్చి వెళ్తానని చెప్పగా, దీనిపై చైర్మన్ ఉప్పలయ్య స్పందిస్తూ ఎవరు ఫిర్యాదు చేసినా దాన్ని కమిషనర్కు ఫార్వర్డ్ చేయడం తప్ప.. తాను చేసేదేమీ లేదన్నారు.
ఏదైనా సమాచారం కావాలంటే అడగండి.. అంతేకానీ ఫిర్యాదు ఇచ్చిన వారికి పిలిచి మాట్లాడేందుకు ఇది పంచాయతీల అడ్డా కాదని.. మున్సిపల్ కార్యాలయమని చెప్పారు. మీకు ఫోన్ చేసి ఫిర్యాదు వచ్చిందని చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇలా అడిగే అధికారం మీకు లేదని, మీకు ఏదైనా సమాచారం కావాలంటే లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వండి ఇస్తామని చెప్పారు. కాసేపటికి చైర్మన్ గదిలో నుంచి అందరిని పంపించి బాలకృష్ణకు ఫిర్యా దు కాపీని అందజేశారు. దీనిపై కమిషనర్ బాలకృష్ణ స్పందిస్తూస్పందిస్తూ.. ఈ విషయంపై న్యాయపరంగా పోరాడుతానని చెప్పి వెళ్లిపోయారు.