మంచిర్యాల, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన ఆలిండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (ఏఐటీయూసీ) జయకేతనం ఎగురవేసింది. 11 డివిజన్లలో 5 చోట్లే గెలువగా, అత్యధిక ఓట్లు రావడంతో గుర్తింపు హోదా దక్కించుకున్నది. ఇక కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) ఆరుచోట్ల గెలిచినా.. తక్కువ ఓట్లు రావడంతో గుర్తింపు సంఘంగా ఎన్నిక కాలేకపోయింది.
సింగరేణి 11 ఏరియాల్లోనే అతి పెద్దదైన శ్రీరాంపూర్లో ఏఐటీయూసీకి 4,856 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి ఐఎన్టీయూసీకి ఇక్కడ 2,690 ఓట్లు వచ్చాయి. దీంతో 2,166 భారీ మెజార్టీతో ఏఐటీయూసీ గెలిచింది. బెల్లంపల్లిలో 122 ఓట్లు, మందమర్రిలో 469 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. వీటితో పాటు ఆర్టీ-1, ఆర్టీ-2 ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన గుర్తింపు సంఘమైన ఐఎన్టీయూసీ కొత్తగూడెం కొర్పొరేట్, కొత్తగూడెం డివిజన్, మణుగూర్, ఇల్లందు, ఆర్జీ-3, భూపాలపల్లి ఏరియాల్లో గెలిచింది. మొత్తం 11 ఏరియాల్లో ఐఎన్టీయూసీ 6 ఏరియాల్లో, ఏఐటీయూసీ 5 ఏరియాల్లో గెలుపొందాయి. కానీ ఓట్ల పరంగా చూసుకుంటే ఏఐటీయూసీకి రెండువేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా రాగా, గుర్తింపు సంఘం హోదాను దక్కించుకున్నది.
కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చి నెల రోజులు కూడా కాకముందే కోల్డ్బెల్ట్ ఏరియాలో కీలకమైన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సింగరేణి కార్మికులు వారి గుర్తింపు సంఘాన్ని తిరస్కరించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచినా, ఈ మూడు ఏరియాల్లో ఐఎన్టీయూసీని కార్మికులు చిత్తు చేశారు. కార్మిక సంఘంలో సుదీర్ఘకాలంగా ఉన్న వారిని కాదని కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడం, ఇటీవల కాలంలో జరిగిన చేరికలతో గుర్రు మీద ఉన్న కార్మికులు ఎన్నికల్లో కోపాన్ని చాటిచెప్పారు. దీంతో మూడు ఏరియాల్లో ఐఎన్టీయూసీకి పరాభవం తప్పలేదు. కాగా ఖమ్మం, వరంగల్ ఏరియాల్లో మంత్రులను ఇన్చార్జులుగా పెట్టినా.. ఐఎన్టీయూసీ కరీంనగర్, మంచిర్యాల జిల్లాలకు ఎమ్మెల్యేతో సరిపెట్టింది. ఇది కూడా ఈ ఏరియాల్లో ఆ సంఘం ఓటమికి దారితీశాయి.
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 28 : సీసీసీ సింగరేణి ఆఫీసర్స్ క్లబ్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలకు తరలివచ్చారు. ఆయా యూనియన్ల కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు. రాత్రి 11గంటల వరకు రిజల్ట్స్ కోసం వేచిచూశారు. ఏఐటీయూసీ విజయం సాధించడంతో నాయకులు సంబురాల్లో మునిగితేలారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు పంచి.. నృత్యాలు చేశారు. ఫలితాల తర్వాత ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బాజీసైదా, కొట్టే కిషన్రావు కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పాల్గొన్నారు.