కాగజ్నగర్, ఏప్రిల్ 27 : కాగజ్నగర్ డివిజన్లోని మద్యం వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ఓ లిక్కర్ లీడర్ అండదండలతోనే మద్యాన్ని ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైన్స్ల నిర్వాహకులంతా సిండికేట్గా మారి ధనార్జనే ధ్యేయంగా మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా, సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
మద్యం ప్రియులు ఫిర్యాదు చేసినప్పుడల్లా.. ఏదో తూతూ మంత్రంగా విచారణ చేపట్టడం.. ఆపై వదిలేయడం పరిపాటిగా మారుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. సదరు లీడర్ అధికారులకు లంచాలు ఇచ్చి మరీ.. ఈ వ్యవహారమంతా నడిపిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాగజ్నగర్ డివిజన్లోని చింతలమానేపల్లి మండలం గూడెంలోని వైన్స్లో అధిక ధరలకు మద్యం విక్రయించడం.. ఆ విషయమై మద్యం ప్రియులు నిర్వాహకులను ప్రశ్నించడం.. ఆ వీడియో వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి హుటాహుటిన ఎక్సైజ్ ఎస్ఐని పంపించి విచారణ చేపట్టించారు. కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాల్లో ఒక్కో క్వాటర్, బీరుపై రూ. 20 నుంచి రూ. 30 దాకా అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగజ్నగర్ డివిజన్ పరిధిలో 15 లైసెన్స్ మద్యం దుకాణాలు, 3 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఓ మద్యం వ్యాపారి లిక్కర్ లీడర్గా అవతారమెత్తి ఈ వ్యవహారాన్నంతా తన కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు తెలుస్తున్నది. వైన్స్ నిర్వాహకులను మచ్చిక చేసుకొని సిండికేట్ వ్యాపారం చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏదైనా సమస్య వస్తే ‘నేను చూసుకుంటా…మీరేం భయపడవద్దు’ అని భరోసానిస్తూ అక్రమ దందా సాగిస్తున్నట్లు తెలుస్తుంది.
ఏవరైనా మద్యం వ్యాపారి సిండికేట్ వ్యాపారానికి ఒప్పుకోకుంటే అతని ఆగ్రహానికి గురి కావాల్సిందేనట. సిండికేట్ వ్యాపారానికి ఒప్పుకోలేదని సదరు వ్యాపారుల దుకాణాలపై కొన్ని నెలల క్రితం రైడ్ జరిపించాడని పట్టణంలో చర్చ జరుగుతున్నది. కాగా, ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనల మేరకు మద్యం విక్రయాలు జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.