సోన్, జనవరి 18 : రాష్ట్రంలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో పోలీసు ఉద్యోగార్థుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 16 వేల పైచిలుకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్పటికే ఫిజికల్ ఫిట్నెస్, పరుగు తదితర పరీక్షలు ముగిశాయి. ఇక మార్చి 11న ఎస్సై, ఏప్రిల్ 30న కానిస్టేబుల్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సర్కారు ప్రకటించింది. నిర్మ ల్ జిల్లాలో దాదాపు 1500 మంది అభ్యర్థులు ఎస్సై, కానిస్టేబుళ్లు, తత్సమాన హోదా గల ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే గ్రంథాలయాలు, నిజామాబాద్, హైదరాబాద్, తదితర ప్రధాన పట్టణాలకు వెళ్లి రాత పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా గ్రం థాలయాల్లో సందడి కనిపిస్తున్నది. పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ను సమీకరించుకొని తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ కల నెరవేర్చు కునేందుకు పగలు,రాత్రి అనే తేడా లేకుండా పుస్త క పఠనం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో రాత పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు సాగుతున్నారు.
గ్రంథాలయాలు.. కిటకిట..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంతో పాటు కావేరి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న గ్రంథాలయం ఉద్యోగార్థులతో ప్రతిరోజూ కిటకిటలాడుతోంది. జిల్లా కేంద్ర గ్రంథాలయం లో దాదాపు 300 మంది, కావేరి గ్రంథాలయం లో 120 మంది వరకు అభ్యర్థులు ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకే గ్రం థాలయాల బాట పడుతున్నారు. జిల్లా కేంద్ర గ్రం థాలయంలో ఆ శాఖ తరపున అభ్యర్థులకు కావాల్సిన వందలాది పోటీ పుస్తకాలు అందుబాటులో ఉంచారు. అంతేగాకుండా నీటి వసతి, రీడింగ్ రూమ్లో ఏసీ సదుపాయం కల్పించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితో నూతనంగా మరో రెండు గదులను ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి తేనున్నారు. అదేవిధంగా కావేరి గ్రంథాలయంలోనూ పాఠకులకు నీటి వసతి, ఫర్నిచర్తో పాటు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు.
ఎస్సై ఉద్యోగమే లక్ష్యం
ఎంఎస్సీ పూర్తి చేసిన. ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న క్రమంలోనే పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. సివిల్ ఎస్సై ఉద్యోగం సాధించడమే లక్ష్యం. ఇప్పటికే ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో అర్హత సాధించిన. రాత పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న. ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న. సొంత నోట్స్తో పాటు గ్రంథాలయం తరఫున అందుబాటులో ఉంచిన పుస్తకాలు ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రతి ఆదివారం గ్రంథాలయ అధికారులు నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పట్టుదలతో ఎస్సై ఉద్యోగాన్ని సాధించి తీరుత.
– కే.స్వాతి, నిర్మల్
మూడు నెలలు శ్రమిస్తే కల నెరవేరుతది
మాది పిప్రి గ్రామం. నిర్మల్ జిల్లా కేంద్రంలో గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నా. ఉదయమే గ్రంథాలయానికి వెళ్లి సాయంత్రం దాకా చదువుకుంటున్నా. ఇప్పటికే మూడు నెలల పాటు కోచింగ్ తీసుకున్న. ఇక్కడ అందుబాటులో ఉన్న పుస్తకాలతో పాటు సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటున్నా. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాలనే దృఢసంకల్పంతో ఉన్నాను. కుటుంబసభ్యుల సహకారం కూడా ఉంది. ఈ మూడు నెలల పాటు శ్రమిస్తే కచ్చితంగా నా కల నెరవేరుతుందన్న నమ్మకముంది.
– పీ.గోపి, పిప్రి, లోకేశ్వరం మండలం