నార్నూర్/దస్తురాబాద్, జూలై 2 : వానకాలం సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది రైతులు పలు పంటల విత్తనాలు వేశారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తుతాయో లేదోనని ఆందోళన చెందారు. ప్రస్తుతం మండలంలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా రైతులు హలాలు పట్టి సాగు బాట పడుతున్నారు. ఈ సమయంలో విత్తనాల ఎంపిక చాలా కీలకమైంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెట్టుబడితో పాటు శ్రమంతా వృథా అవుతుంది. ఈ క్రమంలో విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహ న కల్పిస్తున్నారు. సాధారణంగా దుకాణాదారులు రైతుల నిర్లక్షరాస్యతను ఆసరాగా చేసుకొని నాసిరకం విత్తనాలు అంటగడుతుంటారు. వారిచ్చిన కంపెనీ విత్తనాలు తీసుకెళ్లాల్సి వస్తుంది. డీలర్లు అంటగట్టే విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకూడదనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. విత్తనాలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
నకిలీ విత్తనాలు అమ్మిన, కొన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మారుమూల ప్రాంత గ్రామాల్లోని రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నకిలీ విత్తనాలు విక్రయించే అవకాశం ఉంది. ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు, ఎరువులు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలి. లైసెన్స్ గల దుకాణాల్లోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలి.
-బీ ప్రభాకర్ రెడ్డి,ఎస్ఐ,దస్తురాబాద్
రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి..
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు, మందులు తీసుకోవాలి. అనుమానం వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. విత్తనాల ఎంపికపై వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి.
-సంధ్యారాణి, ఇన్చార్జి ఏవో, కడెం
అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ గుర్తింపు ఉన్న దుకాణాల నుంచే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తన మొలక శాతంలో తేడాలొస్తే వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. విత్తనాలు కొనుగోలుకు సంబంధించిన రసీదులు భద్రంగా ఉంచుకోవాలి. నకిలీ విత్తనాలతో మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు రైతులకు న్యాయం చేకూరే అవకాశం ఉంటుంది.
– జాడి దివ్య, మండల వ్యవసాయాధికారి, గాదిగూడ