మంచిర్యాల అర్బన్, జూన్ 28 : వానకాలం యాక్షన్ ప్లాన్ను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది 4.57 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. కడెం కింద 62,702 ఎకరాలు, ర్యాలీ, నీల్వాయి, గొల్లవాగు కింద 7,082, 897 చెరువుల కింద 83,005 ఎకరాలు సాగవుతున్నాయి. అలాగే గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కింద 62,702 ఎకరాలు సాగవుతోంది. ఈ లిఫ్ట్ నీటిని యాసంగిలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. వానకాలం అవసరమైతేనే లిఫ్ట్ నీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది 4,57,618 ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో అధికంగా పత్తి 2 లక్షల ఎకరాలు, వరి 1,59,473, కందులు 12 వేలు, జీలుగలు 52,125, జనుములు 30 వేలు, కందులు 6,297, పిల్లి పెసర 2 వేలు, పెసర 1,590, మినుములు 305, సోయాబీన్ 125 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
31,892 క్వింటాళ్ల వరి.. 3,59,220 ప్యాకెట్ల పత్తి విత్తనాలు
వానకాలం సాగును దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా వ్యవసాయ శాఖ అధికారులు వరి, పత్తి విత్తనాలను సిద్ధం చేసింది. 3,59,220 ప్యాకెట్ల పత్తి, 31,892 క్వింటాళ్ల వరి ధాన్యం విత్తనాలు అవసరముంటుందని అధికారులు అంచనా వేసి అందుబాటులో ఉంచారు. వీటితోపాటు జీలుగ 6,255 క్వింటాళ్లు, జనుములు 2,647, సోయా 37.5, కందులు 243.5, పెసర 127.4, మినుములు 24.4 క్వింటాళ్లు అవసరముంటుందని ముందుగానే తెప్పించారు. రైతులకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాల నిల్వలు ఆయా ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.
1,05,132 మెట్రిక్ టన్నుల ఎరువులు
ఈ ఏడాది వానకాలం సాగుకు అనుకూలంగా 1,05,132 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. యూరియా 49,450 మెట్రిక్ టన్నులు, డీఏపీ 19,200, ఎంవోపీ 12,940, కాంప్లెక్స్ 18 వేలు, జింక్ సల్ఫేట్ 1,352, ఎస్ఎస్పీ 4,190 మెట్రిక్ టన్నులు అవసరముంటుందని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇప్పటికే యూరియా 21,500 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,200, కాంప్లెక్స్ 13,149, ఎంవోపీ 1,540 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. మిగతావి వ్యవసాయ శాఖ అవసరాన్ని ఆధారంగా విడుతలవారీగా అందుబాటులో ఉంచనుంది.
సీజన్కుముందే ఎరువులు, విత్తనాలు
వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, ఎరువులు అందుబా టులో ఉంచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నం. రైతులకు సమస్య లు రావద్దనే ఉద్దేశంతో క్లస్టర్వారీగా అందించేందుకు ప్రయత్నిస్తున్నం. జిల్లాలోని 52 క్లస్టర్ల ద్వారా క్షేత్రస్థాయి, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. సాగు విస్తీర్ణం పెరుగుతుందనే అంచనాతోనే గతంలో కంటే ఎరువులు, విత్తనాలను ఎక్కువగా తెప్పిస్తున్నం. పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలతో పాటు ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉంచాం. రైతులు ఎమ్మార్పీకి మించి ఇవ్వరాదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలి.
– కల్పన, జిల్లా వ్యవసాయాధికారిణి, మంచిర్యాల.