నిర్మల్ జిల్లాలో ఆయిల్ మిల్లు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సోన్ మండలం పాక్పట్లలో ఇందుకోసం 40 ఎకరాలు కేటాయించగా, త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మలేషియాకు చెందిన ప్రీ యూనిక్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోగా, రూ. 400 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1822 మంది రైతులు 4772 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తుండగా, ప్రభుత్వ ప్రోత్సాహంతో మరికొందరు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ పరిశ్రమ ఏర్పాటైతే వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాదిమందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది.
-నిర్మల్, జూలై 10(నమస్తే తెలంగాణ)
నిర్మల్, జూలై 10(నమస్తే తెలంగాణ):జిల్లాలో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటు కోసం ఇప్పటికే సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో 40 ఎకరాల భూమిని కేటాయించారు. త్వరలోనే ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటు పనులకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇటీవల జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి ఉద్యానవనశాఖ అధికారులతో కలిసి పాక్పట్లలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ పంటను సాగు చేసేందుకు రైతులకు అవసరమైన రాయితీలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. 2022-23లో జిల్లా వ్యాప్తంగా 3572 ఎకరాల్లో ఆయిల్పామ్ ప్లాంటేషన్ను పూర్తి చేశారు. అలాగే ఈ ఏడాది 2023-24 సంవత్సరానికి గాను 8వేల ఎకరాల్లో ప్లాంటేషన్ చేయించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1200 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయింది. ఈ వానకాలంలో 3400 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలను పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
అయితే ప్రతియేటా ఈ సాగు లక్ష్యాన్ని మరింత పెంచి, రాబోయే రోజుల్లో పంట ఉత్పత్తుల ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఉద్యానవన శాఖ ఆయిల్పామ్ సాగుకు సంబంధించిన లక్ష్యాన్ని, ప్రణాళికను రూపొందించి ఇప్పటికే సర్కారుకు నివేదించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సాగయ్యే ఆయిల్పామ్ గింజలను నూనెగా తయారు చేసేందుకు ఓ పరిశ్రమను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీని కోసం మలేషియాకు చెందిన ప్రీ-యూనిక్ కంపెనీతో పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.400 కోట్లకు పైగా అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం స్థల సేకరణను చేపట్టగా, పరిశ్రమ స్థాపన వ్యయాన్ని ప్రీ-యూనిక్ కంపెనీ భరించనున్నది. కాగా సారంగాపూర్ మండలం బీరవెల్లిలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచేందుకు ఇప్పటికే భారీ నర్సరీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నర్సరీలో 3.70లక్షల ఆయిల్ పామ్ మొక్కలను పెంచుతున్నారు. అయితే గత ఏడాది కాలంగా ఉద్యానవన శాఖాధికారులతో పాటు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సైతం ఆయిల్పామ్ పంటను సాగు చేయాలని పిలుపునివ్వడమే కాకుండా స్వయంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్ మొక్కలను నాటించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఆయిల్పామ్ సాగుపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1822 మంది రైతులు ముందుకు వచ్చి 4772 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలను నాటారు. కాగా సాగు నీటి వనరులు పుష్కలంగా ఉండి, డ్రిప్ ఇరిగేషన్ లాంటి సౌకర్యాలు ఉన్న రైతులకు మొదట ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆయిల్పామ్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే రైతులకు రవాణా వ్యయం భారంగా మారే అవకాశం ఉన్నది. దీంతో పాటు పొరుగున ఉన్న నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కూడా ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని ఉధృతం చేస్తున్న కారణంగా, గింజల నుంచి ఆయిల్ను తీసే పరిశ్రమ ఏర్పాటు అవసరమున్నదని గుర్తించారు. దీంతో ఆయిల్పామ్ పంటను సాగు చేయాలని భావిస్తున్న రైతులకు మరింత ఊతమిచ్చినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పరిశ్రమ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాదిమంది రైతులకు పరోక్షంగా ఉపాధి లభించనున్నది. ఇదిలా ఉంటే ఇక్కడ ఏర్పాటు చేయనున్న పరిశ్రమలో ఎంత వరకు మిల్లింగ్ సాధ్యమవుతుందోననే అంశాలపైనా కసరత్తు జరుగుతున్నది. సాంకేతికపరమైన అనుకూలతలు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, ఆయిల్పామ్ దిగుబడులు, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహం లాంటి అంశాలన్నీ పరిశ్రమ అభివృద్ధి, ఆయిల్పామ్ సాగు పురోభివృధ్దికి దోహదం చేస్తాయంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1822 మంది రైతులు 4772 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 8 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడ పామాయిల్ పరిశ్రమ ఏర్పాటైతే మరింత మంది రైతులు ఆయిల్పామ్ సాగుకు ముందుకొస్తారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలోని ఆయిల్పామ్ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడే పరిశ్రమ ఉండడం వల్ల పంట చేతికొచ్చిన తర్వాత ఆయిల్పామ్ గింజల రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. మార్కెటింగ్ సదుపాయం ఉంటుంది. మొక్కలు నాటిన నాలుగేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడులు వస్తాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. రైతులు సంప్రదాయ పంటలతో పాటు కొంత భూమిని ఆయిల్పామ్ సాగు కోసం కేటాయిస్తే అధిక లాభాలు పొందవచ్చు.
-శ్యాంరావ్ రాథోడ్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, నిర్మల్