మంచిర్యాల, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విషప్రయోగంతో పులులు చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జిల్లా అటవీ శాఖ, మిగిలిన పులుల జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నది. బుధవారం మొదటి రోజు 70 ట్రాకర్లతో 15 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టిన అధికారులు, రెండోరోజైన గురువారం 120 మంది ట్రాకర్లతో 13 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. రెండు పులులు మృతి చెందిన కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంతో పాటు ఆసిఫాబాద్, సిర్పూర్ డివిజన్లలోనూ అన్వేషిస్తున్నారు.
ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని వాంకిడి మండలం సర్కేపల్లి చుట్టూ ఉన్న భారీ గుట్టలు, దట్టమైన అడవిని నలువైపులా ట్రాకింగ్ చేశారు. ఈ క్రమంలోనే అధికారులు మూడు పులుల పాదముద్రలను గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్-9, ఎస్-15 మృతి చెందగా, ఎస్-9(మగపులి) జతగా ఉన్న ఎస్-6(ఆడపులి)తో పాటు వాటి పిల్లలైన మరో రెండు పులుల పాదముద్రలు గుర్తించినట్లు తెలిసింది. దీంతో ఆ మూడు పులులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ పులుల జాడను ట్రాక్ చేసేందుకు కాగజ్నగర్, ఆసిఫాబాద్, సిర్పూర్తో పాటు గురువారం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నుంచి ట్రాకర్ల బృందాలను రప్పించారు. తొలుత మృతి చెందినట్లు గుర్తించిన ఎస్-15 పులి ఇంకో పులితో పోరాడి చనిపోయినట్లు చెప్పిన అధికారులు.. ఇప్పుడు ఆ పులి సైతం విషప్రయోగంతోనే మరణించి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం ఆరు పులుల్లో రెండు చనిపోగా, మూడు సురక్షితంగా ఉన్నాయనుకుంటే, మరో పులి ఏమైందన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ ఆరు పులుల్లో ఒకటి ఎప్పటి నుంచో తల్లిదండ్రులను వదిలేసి వేరుగా సంచరిస్తున్నదని, విషం తిన్న పులుల్లో అది ఉందా లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ఈ విషయంలో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
విషప్రయోగం చేసినట్లుగా అనుమానిస్తు న్న ఆరుగురిని అధికారులు బుధవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామానికి చెందిన నలుగురు, కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని దరి గాం గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఇందులోని ఇద్దరు తామే విషప్రయోగం చేసినట్లు ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. విష ప్రయోగం చేసిన ఇద్దరు కూడా సర్కేపల్లి వాసులుగా చె బుతున్నారు. ఈ ఇద్దరితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మైనర్లు, దరిగాంకు చెందిన మరో ఇద్దరు విషప్రయోగానికి సహకరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
వీరంతా ఇప్పుడు అదుపులోనే ఉన్నారు. గురువారం ఉదయం ఈ ఆరుగురిని అధికారులు అడవిలోకి తీసుకెళ్లి.. పులులకు విష ప్రయోగం చేసి ఆహారాన్ని తింటున్నప్పుడు ఎక్కడి నుంచి చూశారు.. ఎలా వీడియో తీశారు.. అనే విషయాలపై సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేశారు. పశుకళేబరంపై విషం చల్లిన తర్వాత .. ఆ డబ్బాను పడేసిన ప్రాంతంతో పాటు వారు వచ్చి వెళ్లిన మార్గాన్ని అధికారులకు చూపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం రాత్రి వరకు పులుల కోసం వెతుకులాట కొనసాగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
కాగజ్నగర్, జనవరి 11 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఊట్పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో లేగదూడపై పులి దాడి చేసిన విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊట్పల్లి గ్రామ శివారులోకి సోమవారం పశువులు మేతకు వెళ్లాయి. మూడేళ్ల లేగదూడపై పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని పశువుల కాపరి అదే రోజు సాయంత్రం వెళ్లి దాని యజమానికి తెలియజేశాడు. చివరకు గ్రామస్తులకు తెలియడంతో వారు గురువారం అటవీశాఖ అధికారులకు తెలిపారు. ఈ ఘటనపై వెళ్లి విచారణ చేపడుతున్నారు.
కాగజ్నగర్, జనవరి 11: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం దరిగాం గ్రామ అటవీ ప్రాంతంలో పులులు మృతి చెందిన ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. షర్కపల్లి, రింగరీట్, దరిగాం గ్రామాలకు చెందిన పలువురు అనుమానితులను బుధవారం అదుపులోకి తీసుకొని కాగజ్నగర్ డివిజన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. గంటల కొద్దీ వేచి ఉన్నా తమ పిల్లలను కలువనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి ఆధ్వర్యంలో గురువారం రాత్రి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు తమ అదుపులో ఉన్నవారిని కలిసేందుకు అనుమతించారు. ఇందులో ఇద్దరు మైనర్ బాలురు ఉండగా, వారిని బయటకు పంపించారు. వారు మీడియాతో మాట్లాడుతూ తమను ఇష్టారాజ్యంగా కొట్టారని, దీంతో భయపడి ఒప్పుకున్నట్లు వేలిముద్రలు వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అదుపులో ఉన్నవారందరినీ బట్టలు విప్పి కొట్టారంటూ మైనర్ బాలురు చెప్పారు.