‘కాంగ్రెస్ పాలనలో మూడు గంటల కరెంటు కోసం బావులు వద్ద పడిగాపులు కాసేవాళ్లం. నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి. చిన్న రైతులు ఎవుసం చేయలేని పరిస్థితులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు పంటలకు నీళ్లు పెడుతున్నాం. రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతదని,10 హెచ్పీ మోటర్లు వాడాలని రేవంత్రెడ్డి అంటున్నాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 3 హెచ్పీ మోటర్లకు కరెంటు ఇయ్యనోళ్లు ఇప్పడు 10 హెచ్పీ మోటర్లకు కరెంటు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు. టాన్స్ఫార్మర్లమీద లోడ్ పడి కాలిపోతయ్. రేవంత్రెడ్డికి 10 హెచ్పీ
ఆలోచన రావడం దురదృష్టకరం. కరెంటు గురించి మాట్లాడుతున్న ఆ నాయకులకు ఎవుసమంటే తెలుసా..’ అని రైతులు మండిపడుతున్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 28 : వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నది. దీంతో మా వ్యవసాయ భూముల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అనడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు తెచ్చింది. ప్రభుత్వం రైతుబీమా, రైతుబంధు పథకాలతోపాటు సమయానికి విత్తనాలు, ఎరువులు, వివిధ రకాల పథకాలు అందిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో రాత్రి, పగలు వ్యవసాయానికి విద్యుత్ అందుతున్నది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఉంటేనే పంటలు పండించడం కష్టం కాదు. దీంతో యాసంగిలో రైతులు అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు.
– రమేశ్, రైతు, ఏమాయికుంట
బజార్హత్నూర్, నవంబర్ 28 : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి మరొకటి తెస్తే మళ్లీ దళారీ రాజ్యం వస్తది. రికార్డుల్లోని భూముల వివరాలను ఇష్ట మొచ్చినట్లుగా నమోదు చేస్తరు. భూతగాదాలు ఎక్కువైతయ్. ఏ రైతు భూమి ఎవరికి ఉందో తెల్వదు. లంచాలు పెరుగుతాయ్. ఒకరి భూమి మరొకరికి రాసి గొడువలు పెడతారు. ధరణి వచ్చినంక రైతులకు భరోసా ఏర్పడింది. ఎలాంటి పైరవీలు, లంచం ఇవ్వకుండా భూములు పట్టాలు చేయడం సంతోషంగా ఉంది. ఇది కాంగ్రెసోళ్లకు ఇష్టం లేనట్లుంది. రైతుల జీవితాలతో చెలగాటమాడాలని సుత్తాండ్రు. సక్కగ ఉన్న ధరణిని తీసేస్తమని చెబుతున్న కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలి. పొరపాటున కూడా కాంగ్రెస్కు అవకాశం ఇస్తే ఇక అంతే. రైతులకు మేలు చేసే బీఆర్ఎస్కు అండగా నిలుస్తం.
– గంగాధర్, రైతు, కొల్హారి, బజార్హత్నూర్ మండలం
తాంసి, నవంబర్ 28 : కాంగ్రెస్ నాయకుల మాటలతో రైతుల్లో భయం మొదలైంది. కౌలుదారుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వారి పేర్లను రికార్డుల్లో చేస్తామనడం ఆందోళన కలిగిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధును భూ యజమాని లేదా కౌలుదారుల్లో ఒక్కరికే ఇస్తామనడం సమంజసం కాదు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలతో భూ యజమానులు ఎవ్వరూ తమ భూములను కౌలుకు ఇవ్వరు. గతంలో ఏ యజమాని కూడా కౌలు రైతుతో రాత పూర్వకంగా ఒప్పందం చేసుకోలేదు. కౌలు చేసే వారి పేర్లను భూ రికార్డుల్లో ఎక్కిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఏ సమస్యలు రాకుండా చూసే సీఎం కేసీఆర్కే మా రైతుల మద్దతు ఉంటుంది.
– కొత్తపెల్లి నాగమణి, మహిళా రైతు, తలమడుగు
సొనాల, నవంబర్ 28 : కాంగ్రెసోళ్లను నమ్మితే ఊళ్లు ఆగమైతయ్. మునుపటి రోజులు మళ్లా వస్తయ్. కరెంటు కోతలు, సాగు నీటి కష్టాలు మొదలైతయ్. తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులందరికి మేలు జరుగుతుంది. భూములు అమ్మిన, కొన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటలేవు. తొందరగా రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా ధరణి అందరికీ అందుబాటులో ఉంది. కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు గానీ ధరణి తీసేసి ఇంకేదో తెస్తదట. తీసుకోచ్చేది భూమాత కాదు, భూమాయ చేసి ముంచేటట్టున్నరు. అందుకే కాంగ్రెసోళ్లను నమ్మేదే లేదు. అందుకే కేసీఆర్ సార్కే మా మద్దతు.
– మస్కరి రాజు, రైతు, సొనాల
బజార్హత్నూర్, నవంబర్ 28 : కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి చెప్పినట్టు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే ఇప్పుడున్న పైపులైన్లు ఆగుతయా. ఎక్కడికక్కడ పగిలి పోతయ్. మా బోరు దగ్గర నీళ్లు పారడానికి రెండున్నర ఇంచుల పైపులైన్ ఏసుకున్నం. ఉన్న మోటరును పీకేసుకొని చెత్తబుట్టల పడెయ్యాలె. లక్షలు పెట్టి కొత్తగా 10 హెచ్పీ మోటర్ కొనాలే. పైపులైన్ కూడా పీకెయ్యాలె. గివన్నీ మాలాంటి గరీబ్ రైతులతోని గావు. కాంగ్రెస్ మాటలింటే ఎవుసం వదిలేసి దేశాలు పట్టుకొని పోవాలే. కాంగ్రెస్ గెలిస్తే చూద్దాం.
– రియాజ్ కోల్హారి, రైతు, బజార్హత్నూర్
ఇంద్రవెల్లి, నవంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్తోనే రైతుల భూములకు పూర్తి రక్షణ ఉంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి తప్పింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులతోపాటు భూముల సమస్యలు పట్టించుకోలేదు. దేశంలో చరిత్రను సృష్టించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలు అమలు చేశారు. ధరణి ఉండడంతో భూముల పట్టా పాస్ పుస్తకాలు రైతుల చేతికొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ మోసం చేయడానికి, సంపాదించుకోవడానికే ధరణిని తీసివేసి, దాని స్థానంలో భూమాతను తీసుకొస్తామంటున్నారు. మళ్లీ పాత కథే పునరావృతం అవుతది. కాంగ్రెస్ నాయకులు గెలిచేది లేదు.. వచ్చేది లేదు.
– తారాసింగ్, రైతు, గలియ బాయితండా.
సొనాల, నవంబర్ 28 : కాంగ్రెస్ చెబుతున్నట్లు 10హెచ్పీ మోటర్ వాడకం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాంగ్రెసోళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ రైతులను ఆగం జేస్తున్నరు. పైన మోటర్ అయితే 3 హెచ్పీ, నీళ్లళ్ల మోటర్ అయితే 5 హెచ్పీ మోటర్లను వాడుతున్నం. 10హెచ్పీ మోటర్ అనేది పరిశ్రమల్లో వాడుతారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోదు. ఆ కరెంటుతో పంటలు పండించడం సాధ్యం కాదు. కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్లకి వ్యవసాయం గురించి ఏం తెలుసు. వాళ్ల మాటలు నమ్మితే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవు. ఎవుసం మూలకు పడతది. రైతలు ఇప్పుడు 24గంటల కరెంట్తో సంతోషంగా బతుకుతున్నరు. 24 గంటల కరెంట్ ఉండాలంటే సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలి.
– సిర్పూర్ సత్యనారాయణ, రైతు, సొనాల
జైనథ్, నవంబర్ 28 : కాంగ్రెస్ పార్టీ వాళ్లు రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతదంటున్నరు. గతంల వారే నాలుగు గంటలిచ్చినపుడే పంటలు ఎండిపోయాయి. గిప్పుడు మూడు గంటలిస్తే ఎలా సరిపోతది. కాంగ్రెసోళ్లు అవగాహన ఉండి మాట్లాడుతున్నరో లేదో తెలియడం లేదు. ఒక్కో నాయకుడు ఒక్కో ప్రకటన చేస్తడు. రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటు సాలంటడు. ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు దుబారా అంటడు. భట్టి విక్రమార్క ధరణిని ఎత్తేస్త అంటడు. అందరూ పెద్ద నాయకులే. ఒకరి మధ్య ఒకరికి సయోధ్య లేదు. ఎవరికీ వారే ప్రకటనలు చేస్తున్నారు. గిప్పుడే ఇలా ఉంటే ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటున్నం. మాకు సీఎం కేసీఆరే కావాలి.. సారే రావాలి.
– ఎల్టీ భూమారెడ్డి, రైతు, కాప్రి, జైనథ్ మండలం