ఎదులాపురం, మే 5 : గౌతమ బుద్ధుడు చూపిన బాటలో నడుస్తూ ప్రశాంత జీవనం గడపాలని, ఆ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. బౌద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని కైలాస్నగర్లోని అశోక్ సామ్రాట్ బుద్ధ విహార్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం అతిథులు నీలి పగిడీలు ధరించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ దుర్గం శేఖర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతోనే పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోగలిగామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ వేషధారణల్లో ఉన్న చిన్నారులు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేట్ అధ్యక్షుడు బాబా సాహెబ్ కాంబ్లే, నాయకులు దాదా సాహెబ్, మెట్టు ప్రహ్లాద్, శైలేందర్, శోభాతాయి, రామ్కుమార్, పండ్ల శీను తదితరులు పాల్గొన్నారు.
బేల, మే 5 : మండలంలోని మణియార్పూర్ గ్రామంలో ఘనంగా బుధ్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన బుద్ధవిహార్ భవనంతో పాటు గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బుధ్ధ విహార్లో గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్యం ప్రమోద్ రెడ్డి, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, నాయకులు దేవన్న, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, మస్కే తేజ్రావ్, విఠల్ వారాడే, తాన్భా ఠాక్రే, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భైంసాటౌన్, మే 5 : శాంతి, సమానత్వం ప్రపంచానికి బోధించిన వ్యక్తి గౌతమ బుద్ధుడని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొనియాడారు. మండలంలోని మహాగాం బుద్ధ విహార్లో గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భారతీయులంతా గర్వంగా తలెత్తుకునేలా తెలంగాణలో సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేశారని, తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టారని గుర్తు చేశారు. బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు విగ్రహావిష్కరణలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఉపాసకుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.