ఎదులాపురం, మే 19 : దేశంలో 60 కోట్ల జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదని, బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దేశానికి బీసీగా ప్రధాని ఉండి బీసీలకు చేసిందేంటని ప్రశ్నించారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కల్పించిన హక్కులేంటన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానం చేసి పంపినా ఇప్పటికీ స్పందన లేదన్నారు. 60 కోట్ల మంది బీసీలున్న దేశంలో మంత్రిత్వశాఖ ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.
రూ.45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.2వేల కోట్ల కేటాయించడం దేనికి సంకేతమన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్ల కేటాయించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కర్ణాటక లో ఉచితాలు ఇస్తామని ప్రకటించినా బీజేపీ ఓట మి చవి చూసిందని ఎద్దేవా చేశారు. కేంద్రం పెత్త నం వల్లే జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించే వెసులుబాటు దక్కడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ తీసుకురావడంతో ఎందరో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక జనం పార్టీ అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీల సంక్షేమానికి వేల కోట్ల ఖర్చు చేశామని, 294 బీసీ రెడిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించామని తెలిపారు.
261 జూనియర్ కాలేజ్లు, 16 డిగ్రీ కళాశాలలను స్థాపించినట్లు తెలిపారు. ఆనాడు ఆంధ్రరాష్ట్రంలో 8వేల మంది గురుకులాల్లో చదువుకునే వారని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,81,800 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏడాదికి రూ.880 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,800 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహార్, ఆత్మ చైర్మన్ జిట్టా రమేశ్, ఎంపీపీ గండ్రత్ రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొమ్మకంటి రమేశ్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, నాయకులు దివిటి రాజు, సెవ్వా జగదీశ్, గంగారెడ్డి పాల్గొన్నారు.