ఎదులాపురం, ఏప్రిల్ 14: దేశానికి దశాదిశ చూపిన గొప్పవ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కరేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంత్యుత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ కార్యాలయ అవరణలో అంబేద్కర్ చిత్రపటం, విగ్రహానికి పూలమాల లు వేసి , పంచశీల జెండాను అవిష్కరించారు. అనంతరం బస్టాండ్లోని చిత్రపటం, బస్టాండ్ ఎదు ట ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే అంబేద్కర్ చౌక్లోని విగ్రహానికి కలెక్టర్ రాహుల్ రాజ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, అధికారులు, ఉత్సవ సమితి సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ..అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారన్నారు.
బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్రం ఏర్పడిందన్నారు. స్వరాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టారని గుర్తు చేశా రు. దళితుల కోసం రూ.లక్షా 15 వేల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దళిత బస్తీ కింద 1800 కుటుంబాలకు 4218 ఎకరాల భూమి ని పంపిణీ చేసినట్లు చెప్పారు. దళిత బంధు కింద రూ.24.90 కోట్లతో 249 మందికి వారు ఎంచుకున్న రంగంలో ఉపాధి కల్పించినట్లు తెలిపారు. దేశంలోనే అత్యంత భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున తమ ప్రభుత్వం నిర్మించిందని. అసెంబ్లీకి కూడా అంబేద్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. విగ్రహావిష్కరణ, జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ఉత్సవ కమిటీ చైర్మన్ దుర్గం శేఖర్ను అభినందించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభు ్యన్నతికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. ఆయన ఆశయాలను సాధించేందు కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఉత్సవ కమిటీ చైర్మన్ దుర్గం శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల దేవుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఎస్సీడీవో భగత్ సునితా కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఏఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మనీషా, నిర్వాహకులు మల్లన్న, స్వామి, శాలిక్ రావు, ప్రజ్ఞాకుమార్, సుదర్శన్, బాలశంకర్ కృష్ణ, రాంచందర్, భూమన్న, వివిధ కుల సంఘాల ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.