ఆదిలాబాద్, మే 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతున్నది. ఎండకు వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు గొడుగులు, టోపీలు, తలకు టవల్స్ చుట్టుకుంటున్నారు. మంచినీరు, మజ్జిగ, లస్సీ ఇతర చల్లని పానీయాలు తీసుకుంటున్నారు. మరో నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.