మేడిశెట్టి మహేందర్ వర్మ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహించేది. మంచి వేతనాన్ని వదిలి.. సొంత గడ్డపై మమకారం, వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తండ్రి వారసత్వంగా ఇచ్చిన భూమిలో భవిష్యత్తుకు బాటలు వేసుకున్నాడు. నలుగురికి అన్నం పెట్టే నేలతల్లి వైపు అడుగులు వేశాడు. కన్న తండ్రి లాగా వ్యవసాయంలో రాణించాలనే తపనతో పదెకరాల్లో అరటితోట ప్రారంభించాడు. ప్రస్తుతం 20 గంటల్లో మూడు టన్నుల దిగుబడి రాగా.. మార్కెట్లో అమ్మగా రూ.30 వేలు వచ్చాయి. యేడాదిన్నర క్రితం ఎంవీఎం పేరిట వెబ్సైట్ను ప్రారంభించాడు. ఆన్లైన్, క్షేత్రస్థాయికి వెళ్లి కర్షకులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. దీనికితోడు టిష్యూకల్చర్(సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మొక్కను సృష్టించడం)లో సాగు చేయడంపై ప్రయోగాలు చేస్తున్నాడు. అరటిలో అధికంగా దిగుబడి ఇచ్చే జీ-9 రకం సాగుపై పరిశోధనలు చేశాడు. ఇంకా.. అంతరపంటగా ఆయిల్ పామ్ సాగు చేస్తూనే.. డ్రాగన్ ఫ్రూట్ వైపు ప్రణాళికలు సిద్ధం చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.
– దండేపల్లి, అక్టోబర్ 22
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామానికి చెందిన మేడిశెట్టి మహేందర్వర్మ బీఎస్సీ పూర్తి చేశాడు. అనంతరం అలహాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ(సీడ్ టెక్నాలజీ) చదివాడు. 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించాడు. 2019 సంవత్సరంలో అనంతపూర్ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడి(అసిస్టెంట్ ప్రొఫెసర్)గా నియమితులయ్యారు. విధుల్లో భాగంగా పలువురు విద్యార్థులను క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో నీటి కరువు, నేలలో భూసారం లేకపోవడం గమనించాడు. అన్నదాతలు సర్కారు ఇస్తున్న రాయితీ, మూస పద్ధతిలో సాగుకు అలవాటు పడ్డారని గ్రహించాడు. విద్యార్థులతోపాటు రైతులకు సాగులో మెలకువలు నేర్పించి చైతన్య పర్చాలని భావించాడు. ఉద్యోగం చేస్తూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం సాధ్యం కాదని భావించి, ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తక్కువ నీటితో ప్రత్యామ్నాయ పంటలైన పండ్ల తోటలపై దృష్టి సారించాడు.
ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న పండ్ల తోటలపై రైతులు దృష్టి సారిస్తే ప్రయోజనం చేకూరుతుంది. చాలా మంది రైతులు మూస పద్ధతిలో మాత్రమే సాగు చేస్తున్నారు. సంప్రదాయ సాగును వదలడం లేదు. నాణ్యత ఎక్కువ, పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువగా ఉండే టిష్యూకల్చర్ మొక్కలను సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. రానున్న రోజుల్లో డ్రాగన్ ఫ్రూట్ పంట వేసేందుకు ప్లాన్ చేస్తున్నా. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుభవాలను పుట్టి పెరిగిన ప్రాంత రైతులకు అవగాహన కల్పిస్తా.
– మహేందర్వర్మ, రైతు, దండేపల్లి.
రైతులను చైతన్య పర్చేందుకు 2021 జనవరిలో మహేందర్ వర్మ మేడిశెట్టి(ఎంవీఎం) పేరిట వెబ్సైట్ను ప్రారంభించాడు. ఇందులో రైతులకు సూచనలు, సలహాలు ఇస్తూనే.. విత్తనాలు, మొక్కలు లభించే ప్రాంతాల సమాచారం పొందుపర్చాడు. సాగులో అనుమానాలు ఉండి.. రైతుల కోరిక మేరకు గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాడు. కరీంనగర్ కేంద్రంగా బనానా బయోటిక్స్తో కలిసి అంతర పంటగా అరటిసాగుపై అవగాహన కల్పిస్తున్నాడు. కాగా.. సాగు విధానంలో మార్పు తేవాలని భావించిన మహేందర్ కరీంనగర్లోని టిష్యూకల్చర్లో సాగుపై రిటైర్డ్ ఉద్యానవనశాఖ అధికారి నిర్వహిస్తున్న బయోటెక్ ప్రైవేటు కంపెనీలో వ్యవసాయ శాస్త్రవేత్తగా చేరాడు. వివిధ పంటలను టిష్యూకల్చర్(సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మొక్కను సృష్టించడం)లో సాగు చేయడంపై ప్రయోగాలు చేశాడు. అరటిలో అధికంగా దిగుబడి ఇచ్చే జి-9 రకం సాగుపై పరిశోధనలు చేశాడు. ఇంతటితో సంతృప్తి చెందక టిష్యూ విధానంలో తయారు చేసిన మొక్కలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.
మహేందర్ తండ్రి లింగయ్యకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆరున్నర ఎకరాలలో అరటిసాగు ప్రారంభించాడు. ఎకరానికి 1,400 మొక్కల చొప్పున 10 వేల మొక్కలను 2020 డిసెంబర్లో నాటాడు. పంట ప్రారంభంలో ఎకరానికి రూ.60 నుంచి 70 వేల వరకు ఖర్చు చేశాడు. ప్రస్తుతం పంట చేతికొస్తున్నది. మార్కెట్లో కిలో 10 చొప్పున విక్రయిస్తున్నాడు. చెట్టుకు 20 నుంచి 25 కిలోల వరకు అంటే ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు పంట చేతికి రానుందని తెలిపాడు. ఎకరానికి రూ.3 లక్షల వరకు ఆదాయం సమకూరనుందని పేర్కొన్నాడు. మొదటి పంట చేతికొచ్చాక తిరిగి మరో ఏడు నెలల తరువాత రెండో పంట, ఆరు నెలల తరువాత మూడో పంట రానుందని తెలిపాడు. ఒకసారి సాగు చేస్తే మూడు పంటలు వస్తాయన్నారు. మొదటి సారి మాత్రమే ఎకరానికి రూ.60 నుంచి రూ.70 వేల వరకు ఖర్చు వస్తుందని, రెండో, మూడో యేడాదికి రూ.15 వేల వరకు ఖర్చు వస్తుందన్నాడు. కాగా.. ప్రస్తుతం 20 గుంటల్లో మూడు టన్నుల దిగుబడి రాగా.. మార్కెట్లో అమ్మగా రూ.30 వేలు వచ్చాయి.