ఇప్పటికీ చాలా మంది పేపర్, ప్లాస్టిక్ ప్లేట్ల కంటే విస్తరా కుల్లోనే తినేందుకు ఇష్టపడుతుం టారు. ఆరోగ్యాన్ని కాపాడుతుందని మోదుగాకు, తునికాకు, బాదాం, రాగి అడ్డాకు, పొరటాకులతో తయారు చేసిన విస్తర్లను పెద్దలు వినియోగిస్తుంటారు. ఇదే ఆ మహిళలకు వ్యాపార సూత్రంగా మారి, ఆర్థికంగా ఉపాధి పొందేలా నడిపిస్తున్నది. తొలినాళ్లలో ఐదుగురితో కలిసి ప్రారంభించిన ఆదివాసీ స్టార్టప్ ‘మోదుగాకు పరిశ్రమ’ను అన్నీ తానై నడిపిస్తున్నది మంచిర్యాల జిల్లా భీమారం మండలానికి కేంద్రానికి చెందిన పల్ల శ్రీలత. మనరాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్రకు వీటిని ఎగుమతి చేస్తూ, మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నది. వ్యాపార విస్తరణకు సామాజిక మాధ్యమాలను వినియోగించు కుంటూ, సక్సెస్గా ముందుకు సాగుతున్నది.
భీమారం, అక్టోబర్ 22 : విస్తరాకుల్లో భోజనం.. ఇప్పటికీ చాలా మందికి ఎంతో ఇష్టం. ఆరోగ్యానికి మేలు చేస్తుందని చా లా మంది అభిప్రాయపడు తుంటారు. ఇదే ఆ ఐదుగురి మహిళలను ముందుకు నడిపించింది. వీరు స్థాపించిన ‘కుట్టి ఇస్తరి మోదుగు విస్తరి’ ఇప్పుడు మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నది. నాలుగేళ్ల క్రితం ఐదుగురు కలిసి స్థాపించగా, ఇప్పుడు ఒక్కరే రన్ చేస్తూ మరో ఐదుగురికి ఉపా ధి కల్పిస్తున్నారు. భీమారం మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు పూజరి సత్తెక్క , పల్ల శ్రీలత కూలీలుగా పనిచేస్తుండేవారు. పొదుపు సంఘాల ద్వారా చిన్న పరిశ్రమల స్థాపనకు అవసరమైన శిక్షణ లభిస్తుందని తెలుసుకున్నారు. హైదరాబాద్ ఎన్ఐఆర్టీ (నేసనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్)లో విస్తరాకుల తయారీలో శిక్షణ పొందారు.
భీమారం మండల కేంద్రంలో ఆదివాసీ మోదుగాకు పరిశ్రమ ను ప్రారంభించారు. పొదుపు సంఘంలో రుణం తీసుకొని యంత్రాలు కొనుగోలు చేశారు. మార్కెట్లో పేపర్ ప్లేట్లకు మంచి గిరాకీ ఉండగా, విస్తరాకులకు వ్యాపారం కల్పించడం కొంత కష్టంతో కూడుకున్న పని. అయినా శ్రీలత, సత్తెక్క ధైర్యంతో ముందడుగేశారు. సోషల్ మీడియా లో తమ వ్యాపారం గురించి ప్రచారం చేయాలనే ఆలోచన వచ్చింది. మోదుగాకు ప్రయోజనాలు, తమ విస్తరాకుల ప్రత్యేకతలు, ధర, నాణ్యత వివరాలను తన బంధువుల సహాయంతో పోస్ట్ చేసింది. ఇదే ఈ ఆదివాసీ స్టార్టప్ను మార్కెట్లో ముందు కు తీసుకెళ్లింది. ఇలాంటి కంపెనీని తామూ ప్రారంభిస్తామని పలు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఫొటోలు తీసుకెళ్తున్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దయ్య దేవుడి గుడి ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. పది మంది కూలీలతో కలిసి మోదుగాకు పరిశ్రమ నిర్వాహకులు ఇక్కడికి వెళ్తారు, పొద్దంతా ఆకులు సేకరిస్తారు. ట్రాలీలో ఆ ముడిసరుకును పరిశ్రమకు తరలిస్తారు. ఇలా రెండు నెలలకోసారి వెళ్తుంటారు. పెద్దయ్య దేవుడి గుడి వద్ద ప్రతి ఆదివారం, గురువారం జాతర నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల గిరిజనులు ఆవరణలోనే వంటలు చేసుకొని తింటారు. ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది. దీంతో మోదుగాకులతో చేసిన విస్తర్లనే ఎక్కువ వాడుతుంటారు. ఆ సమయాల్లో ఆదివాసీ పరిశ్రమ నిర్వాహకులు విస్తర్లు విక్రయిస్తుంటారు. దీంతో రోజువారీ ఖర్చులకు నాలుగు రాళ్లు సమకూరుతాయి.
సాధారణంగా విస్తర్లు చీపురు పుల్లలతో కుడుతారు. కానీ వీళ్లు మాత్రం కుట్టుమిషన్లపై దారంతో కుడుతుంటారు. కింద పేపర్, పైన ఆకు ఉంటాయి, దీంతో సాధారణ విస్తరి కంటే మందంగా ఉంటుంది. సహపంక్తి భోజనాలు, బఫేట్లోనూ వాడుకునే సౌకర్యం ఉంది. ఒక్కో విస్తరి ధర రూ.నాలుగు కాగా, మోదుగాకుతోనే కాకుండా తునికి , బాదాం , రాగి అడ్డాకు , పొరటాకులతో కూడా తయారు చేస్తుంటారు.
అడివి నుంచి ఆకులు తెచ్చాక వాటిపై నీళ్లు చల్లుతారు. ఒక్క దగ్గర కుప్పగా పోసి బరువు పెట్టేవారు. రెండ్రోజుల తర్వాత పూర్తిగా ఆణిగిపోతాయి. ఆ తర్వాత అట్టను కత్తరించి దానిపై మోదుగు , ఇతర ఆకులు వేసి కుడతారు. ఆ తర్వాత మిషన్ వేసి అచ్చు వేస్తారు. అప్పుడు అన్ని విస్తరాకులకూ ఒకే ఆకృతి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు వస్తుంటాయి.
మోదుగాకుల్లో భోజనం చేస్తే అందులోని జిగురు కడుపులోకి వెళ్లి విరేచనాల నుంచి కాపాడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. మోదుగను ఆయుర్వేద ఔషధాల్లో వాడుతుంటారు. ఈ ఆకులో వేడి అన్నం తింటే కడుపులోని ఎలాంటి క్రిమీ అయినా చనిపోతుందని చెబుతుంటారు. ఈ ఆకులు తొందరగా భూమిలో కలిసిపోయి మంచి ఎరువుగా కూడా మారుతాయి.
ఈ పరిశ్రమను మొదలు పెట్టేందుకు చాలా కష్టపడ్డాం. మొదట్లో ఐదుగురం నడిపేవాళ్లం. ఇప్పుడు ఒక్కదాన్నే నడిపిస్తూ, మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్న. ప్రారంభించేటప్పుడు చాలా మంది హేళన చేసిన్రు. వీళ్లు గీది నడుపుతరా.. అంత సీన్ ఉన్నదా.. అని అన్నోళ్లున్నరు. అవేమి మమ్మల్ని ఆపలేదు. ఇయ్యాల ఇతర రాష్ర్టాలకు కూడా మా విస్తరాకులు వెళ్తున్నయంటే చాలా సంతోషమనిపిస్తున్నది. నా కుటుంబ సభ్యులు కూడా నాకు అండగా ఉంటున్నరు.
-పల్ల శ్రీలత, ఆదివాసీ మోదుగాకు పరిశ్రమ నిర్వాహకురాలు