ఎదులాపురం, అక్టోబర్ 20 : బాలబాలికలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలని, తద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలోని జడ్పీఎస్ఎస్లో మహిళా మైక్రాన్, సీఐఎఫ్ చారిటీస్ ఎయిడెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విజ్ఞాన మేళాను కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు బహుమతులు అందజేశారు. అనంతరం 30 మంది విద్యార్థినులకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.4.50లక్షల ఉపకారవేతనాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, ఎంఈవో జయశీల, సర్పంచ్ భూమన్న, మహిత డైరెక్టర్ రమేశ్ శేఖర్ రెడ్డి, సీఐఎఫ్ ప్రతినిధి సదానంద రెడ్డి సైన్స్ అధికారి రఘురమణ, సెక్టోరియల్ అధికారులు నర్సయ్య, సుజాత్ఖాన్, నారాయణ, ప్రధానోపాధ్యాయులు నరేందర్రెడ్డి, బిక్కుసింగ్, ఎంపీడీసీ నాగుబాయికిషన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎదులాపురం, అక్టోబర్ 20 : రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో మొదటి ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగ్రజాటౌన్ షిప్ సమీపంలోని రాజీవ్ స్వగృహ బహిరంగ వేలంలో ఎవరైనా నిబంధనల మేరకు పాల్గొనవచ్చన్నారు. సందేహాలు ఉన్నట్లయితే అధికారులతో చర్చించి నివృత్తి చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ వివిధ సైజులలో 362 ప్లాట్లు ఉన్నాయన్నారు. ఓపెన్ ప్లాట్లకు చెదరపు గజానికి రూ.8వేలు కనీస ధర నిర్ధారించామని తెలిపారు. ఆసక్తి గల వారు ధరావత్తు సొమ్ము చెల్లించి వేలంలో పాలొనాలని సూచించారు. సందేహాలు ఉన్నట్లయితే నవంబర్ 4వ తేదీన జరిగే ప్రీ బిడ్ సమావేశంలో విషయాలను వివరిస్తామన్నారు. సమావేశంలో టీఎస్ఐఐసీ సహాయ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, జోనల్ మేనేజర్ మహేశ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, తహసీల్దార్లు వనజ, సతీశ్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సాయి కిరణ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.