బోథ్, డిసెంబర్ 21: బోథ్ (కరత్వాడ) ప్రాజెక్టు వద్ద మినీ ట్యాంక్ బండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలో పర్యాటకులను ప్రాజెక్టు చుట్టూ అందాలు కనువిందు చేయనున్నాయి. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ. 3.60 కోట్లు మంజూరయ్యాయి. చిన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. వచ్చిన నిధులతో కట్ట వెడల్పు, కంకర వేసి రెయిలింగ్ చేయడం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం కట్టతో పాటు చుట్టూ వాకింగ్ ట్రాక్పై టైల్స్ వేసే పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు శిఖం చుట్టూ మట్టి రోడ్డుతో పాటు అలుగు కింది భాగంలో దాటేందుకు వీలుగా లోలెవల్ వంతెన పనులు పూర్తి చేశారు. అలుగు పక్కన ఎకరా స్థలంలో పార్కు నిర్మాణం చేపడుతున్నారు. పార్కు చుట్టూ, మధ్యలో వాకింగ్ ట్రాక్ పనులు చేయిస్తున్నారు. పర్యాటకులు కూర్చుండేందుకు వీలుగా బెంచీలు, పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఊయలలు బిగించనున్నారు. కట్ట ముందు భాగంలో గడ్డి పెంచుతున్నారు. రెండు నెలల్లోగా పనులు పూర్తి చేయించేలా చిన్న నీటి పారుదల శాఖ డీఈఈ భీంరావు, ఏఈఈ జాదవ్ ప్రకాశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తయితే బోథ్ వాసులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నిత్యం ఇక్కడికి వచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించనున్నారు.