మంచిర్యాల, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై విప్ సుమన్, నీటి పారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో హైదరాబాద్లోని అరణ్యభవన్లో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. కరకట్టల నిర్మాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. భారీ వరదల కారణంగా పట్టణాలు ముంపునకు గురికాకుండా ఉండడానికి భద్రాచలం తరహాలో కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను వెంటనే పూర్తి చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. రెండో దశలో కొత్త చెక్ డ్యామ్ల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాలవారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ప్రభుత్వ విప్ బాల సుమన్, నీటి పారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో హైదరాబాద్లోని అరణ్యభవన్లో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. వార్దా నదిపై బ్యారేజ్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసి అక్టోబర్ నెల చివరి నాటికి నీటిపారుదల శాఖ అధికారులకు సమర్పించాలని వాపోస్ కన్సల్టెన్సీని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
నియోజకవర్గాలవారీగా సమీక్ష..
నియోజకవర్గాలవారీగా సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు సమావేశంలో వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుషలంగా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్లు, బ్యారేజీలు, లిఫ్ట్ ఇరిగేషన్, చెక్డ్యామ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారన్నారు. రెండో దశలో వాగులు, వంకలపై మరిన్ని చెక్ డ్యామ్లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా భైంసా పట్టణం, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి భద్రాచలం తరహాలో వరద ముంపు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ప్యాకేజీ 28 పనులకు రివర్స్ టెండర్ నిర్వహించాలి..
కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 28లో పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆ పాత కాంట్రాక్టర్ను తొలగించి, రివర్స్ టెండర్ ద్వారా పనులు త్వరితగతిన పూర్తయేయలా చర్యలు తీసుకోవాలని, కాలువలపై వంతెనలు నిర్మించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కోరారు. దీనికి సంబంధించి ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని మంత్రి వివరించారు. నియోజకవర్గాలవారీగా చెక్ డ్యామ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నివేదిక సమర్పించి, డిసెంబర్ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెక్ డ్యాంల నిర్మాణం, ప్యాకేజీ 27, 28 పనులు పూర్తయితే రైతులకు మేలు జరుగుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.
కరకట్టల నిర్మాణంపై సుదీర్ఘ చర్చ..
చనాక-కొరాట, ప్రాణహిత, నీల్వాయి, జగన్నాథపూర్, కుమ్రం భీం, వార్దా, కుఫ్టీ ప్రాజెక్ట్లు, చెన్నూరు, లక్ష్మింపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, ప్యాకేజీ 27-28, సదర్మాట్ బ్యారేజీ, కడెం డ్యామ్కు కొత్త గేట్ల బిగింపు, గోదావరి పరివాహాక వరద ముంపు ప్రాంతాల్లో కర కట్టల(ప్రొటెక్షన్ వాల్) నిర్మాణాలపై అధికారులు మాట్లాడారు. పంపుహౌస్లు, లిఫ్టులు, కాల్వల నిర్మాణ పురోగతి, అటవీ అనుమతులు గురించి అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించారు. లక్ష్మింపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి అటవీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. సమీక్షలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, విఠల్రెడ్డి, రేఖానాయక్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్, మంచిర్యాల సీఈ శ్రీనివాస్ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్దేశ్ పాండే, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.