దస్తురాబాద్, అక్టోబర్ 4 : ప్రజా సమస్యలు సత్వరంగా పరిష్కారం కావాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. పని భారం తగ్గి ప్రభుత్వ కార్యకలాపాలు వేగవంతం కావాలంటే పాలనకరమైన విభజన చేయాలని సీఎం కేసీఆర్ భావించి నూతన మండలాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 2016 అక్టోబర్ 11న జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఉమ్మడి కడెం మండలం నుంచి దస్తురాబాద్ నూతన మండలంగా ఏర్పడింది. మండలంగా ఆరేళ్లు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. మొత్తం 13 పంచాయతీలు, 21 అనుబంధ గ్రామాలతో దస్తురాబాద్ మండలంగా ఏర్పడింది. తహసీల్, పోలీస్ స్టేషన్, మండల పరిషత్, తదితర కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.
ఉమ్మడి కడెం మండలంలో ఉన్నప్పుడు ఆరు పంచాయతీలు ఉండగా, నూతనంగా ఏడు పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇం దులో రెండు తండాలు, రెండు గోండుగూడేలు పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి కడెం మండలంగా ఉన్నప్పుడు తహసీల్ కార్యాలయం చుట్టూ విద్యార్థులు తిరిగేది. సర్టిఫికెట్లు కావాలంటే 10 కిలోమీటర్లు ఆటోలో వెళ్లేది. సమయానికి సర్టిఫికెట్ రాకపోయేది. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ కలిసి తమ సమస్యను విన్నవించాలనుకుంటే గంటల కొద్ది వెచ్చి ఉండే పరిస్థితి. పింఛన్ల విషయంలో సైతం ఇదే పరిస్థితి ఉండేది. కానీ దస్తురాబాద్ మండలంగా ఏర్పడిన తర్వాత విద్యార్థులు, న్యాయం కావాలని వెళ్లిన బాధితులకు ఇబ్బందులు, దూరంభారం తప్పింది. ప్రభుత్వాల కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. నిమిషాల్లో పనులు అవుతున్నాయి. ప్రస్తుతం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కృషితో ప్రజాప్రతినిధుల సహకారంతో మండలం అభివృధ్ధి పథంలో దూసుకెళ్తున్నది. గ్రామాల్లో సీసీ, కొత్తగా బీటీ రోడ్లు, శ్మశానవాటికలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం, ఇలా అభివృద్ధి పథంలో నడుస్తున్నది.