బేల, అక్టోబర్ 2 : మండలంలోని మసాల(కే) పంచాయతీ పరిధిలోని దుబ్బగూడ(ఎం)కు రోడ్డచ్చింది. దశాబ్దాల పాటు నరకయాతన అనుభవించిన గిరిజనుల కష్టాలు కడతేరాయి. ఈ రహదారి నిర్మాణంతో గ్రామస్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అడిగిన వెంటనే నిధులిచ్చిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు కృతజ్ఞతలు చెబుతున్నారు. దుబ్బగూడ(ఎం) ఆవిర్భవించినప్పటి నుంచి రోడ్డు సౌకర్యం లేదు. ఏ అవసరమైనా బండ రాళ్ల దారిలో కాలినడకన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసాల(కే)వరకు నడిస్తేనే రోడ్డు వచ్చేది. ఎన్నో ఏళ్లుగా కొలాం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే బురదలో వెళ్లాల్సి వచ్చేది. ఈ రోడ్డు దుస్థితిపై ఎమ్మెల్యే జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లగా ఎస్డీఎఫ్ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో మొరం రోడ్డు నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఎట్టకేలకు గ్రామానికి రోడ్డు సౌకర్యం కలగడంతో దశాబ్దాల కల నెరవేరిందని కొలాంగిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల కల్వర్టులు, ఎతైనా గుట్ట ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించారు. ఒక చోట పెద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.25లక్షలు అవసరం కాగా ఎమ్మెల్యే రామన్న ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు, పనులు పూర్తి చేయించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, మండల ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
దుబ్బాగూడ గ్రామం ఆవిర్భవించినప్పటి నుంచి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డాం. బండ రాళ్ల దారిలో నడిచి వెళ్తే తప్ప రోడ్డుకు చేరుకునే వాళ్లం కాదు. కొత్తగా రోడ్డు నిర్మించడంతో ఇబ్బందులు తొలగిపోయినాయి. ఎమ్మెల్యే జోగు రామన్నకు రుణపడి ఉంటాం..
-టేకం బారిక్రావ్, దుబ్బగూడ
గ్రామం ఏర్పడి దశాబ్దాలు గడిచిన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డాం. గ్రామానికి రావాలంటే ఏ అధికారులు వచ్చే వారు కాదు. రోడ్డు నిర్మాణం కోసం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బేల ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించారు. రోడ్డు నిర్మించడంతో ప్రజల కల నెరవేరినట్లయింది.
-మారుతి, దుబ్బగూడ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కృషి వల్లే దుబ్బగూడ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పడింది. గ్రామస్తుల ఇబ్బందులు తొలగాయి. ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం. బతికినంతకాలం ఆయనకు రుణపడి ఉంటం.
-గోవింద్రావ్, దుబ్బగూడ, ఉపసర్పంచ్