ఇచ్చోడ, అక్టోబర్ 2 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు సమీపంలోని గాయత్రి జలపాతాన్ని సాహస క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తామని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి గాయత్రీ జల పాతం వద్ద నిర్వహిస్తున్న వాటర్ రాఫెల్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాహసికులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సాహస క్రీడల నిర్వహణకు గాయత్రీ జలపాతం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న జలపాతాలను ఏకో టూరిస్ట్ ప్రాంతాలుగా గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. గాయత్రి జలపాతం వద్ద వసతులు లేకున్నా అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావు జల విన్యాసాల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్, మేడిగూడ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల పీడీ మోహన్సింగ్, ప్రోగ్రాం అధికారులు, సాహసికులు పాల్గొన్నారు.