ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు సమీపంలో గల గాయత్రి జలపాతం వద్ద వాటర్ రాపెల్లింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జలక్రీడల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి దాదాపు 30 మంది సాహసికులు తరలివచ్చారు. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాల వారు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను తిలకించడానికి పర్యాటకులు ఉత్సాహం చూపారు. సాహసికులు చేసే విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కరతాళ ధ్వనులతో వారిని ప్రోత్సహించారు. మొదటి రోజైన శనివారం నార్మల్ రాపెల్లింగ్, రివర్స్ రాపెల్లింగ్ పోటీలను తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావు నిర్వహించారు. పోటీదారులకు సూచనలు, సలహాలు కూడా అందించారు. దాదాపు 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలధారలో సాహసికుల విన్యాసాలు అబ్బురపర్చాయి. జలధారకు ఎదురు వెళ్తూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. న్యాయ నిర్ణేతలు.. తక్కువ సమయంలో నిర్దేశించిన క్రీడలను పూర్తి చేసిన బృందాలను ఎంపిక చేస్తారు. వారికి ప్రశంసాపత్రాలు, పతకాలు, నగదు బహుమతి అందజేస్తారు. ఇక్కడ ఎంపికైన సాహసికులు త్వరలో ఆంధ్రప్రదేశ్లోని అరకు కటికి జలపాతం వద్ద వాటర్ రాపెల్లింగ్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారని తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావు తెలిపారు.
– ఇచ్చోడ, అక్టోబర్ 1
సహసాలకు ఉవ్విళ్తూరే యువతను ప్రోత్సహించడానికి అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావ్ చేస్తున్న కృషి అభినందనీయం. విహార యాత్రలుగా మారే జలపాతాల ప్రదేశాలను సహస కృత్యాలకు నిలయాలుగా తీర్చిదిద్దుతూ యువతలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఇటువంటి పోటీలు యువతలో నైపుణ్యాలను పెంపొందిస్తాయి. వాటర్ రాపెల్లింగ్ పోటీల్లో ఇప్పటివరకు మూడు సార్లు పాల్గొన్నా. ఇక్కడ పాల్గొనడం జీవితంలో మర్చిపోలేని ఘటన. – చిలువేరి ప్రవీణ్ కుమారళ్, వరంగల్ జిల్లా
నాది నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని నగరితండా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే జలపాతాలకు పుట్టినిల్లు. దినపత్రికల్లో వచ్చిన కథనాలు చదివా. అప్పుడు ఎప్పుడు చూడాలనే ఉత్సాహం ఉండేది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. జల విన్యాసా ల్లో ఇప్పటి వరకు కటికి, అరకులోయలో పాల్గొన్నా. ఇప్పుడు గాయత్రి జలపాతం వద్ద పాల్గొనడం కొత్త అనుభూతిని ఇస్తున్నది. గాయత్రి జలపాతం సొగసులు ఎప్పటికి మర్చిపోను.
– ఆడే నానక్రావ్, నగరితండా, నిర్మల్ జిల్లా
నాది ఖమ్మం జిల్లా కేంద్రం. అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావ్ ప్రోత్సాహంతో ప్రత్యేక శిక్షణ పొందా. మొదటిసారి వైజాగ్ రాపెల్లింగ్ పోటీల్లో పాల్గొన్నా. మొదట్లో కొంచెం భయమేసింది. ఇగ ఈ క్రీడలు వద్దని భావించా. నేనెలాగైనా ఈ క్రీడల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. అప్పటి నుంచి చాలా ప్రాక్టీస్ చేశా. ఇప్పటి వరకు ఐదుసార్లు జలవిన్యాసాల్లో పాల్గొన్నా. ప్రథమస్థానం సాధించడమే నా లక్ష్యం.- కుమ్మరి ఉపేంద్రబాబు, ఖమ్మం జిల్లా