సారంగాపూర్/ దిలావర్పూర్, అక్టోబర్ 1: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ దేవస్థానం గంగనీళ్ల జాతర శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అడెల్లి గ్రామం నుంచి అమ్మవారి నగలను డప్పుమేళాలతో తీసుకెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం గర్భగుడిలో ఉంచారు. అనంతరం ఆలయ అర్చకుడు శ్రీనివాస్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు హారతి అందించారు. ఆలయం నుంచి పోచమ్మ అమ్మవారి నగలను గంగస్నానం కోసం అడెల్లి, సారంగాపూర్, యాకర్పల్లి, ప్యారమూర్, బీరవెల్లి, ప్యారమూర్ గ్రామాల మీదుగా వెళ్లి రాత్రికి దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి గ్రామానికి చేరుకుంది. గ్రామాల్లో అమ్మవారి నగలకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
ఆదివారం ఉదయం సాంగ్వి గ్రామసమీపంలో ఉన్న గోదావరిలో అమ్మవారి నగలకు పుణ్యస్నానాలు చేయించి తిరిగి ఇదే గ్రామాల గుండా ఆలయానికి చేరుకుంటారు. కాగా అమ్మవారి నగలను ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు మోశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ రాథోడ్ దత్తురాం, నాయకులు రాజ్మహ్మద్, శ్రీనావాస్రెడ్డి, రాజేశ్వర్రావు, నాగయ్య, నర్సారెడ్డి, దేవిశంకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుంటాల/ లోకేశ్వరం, అక్టోబర్ 1 : అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతరకు కుంటాల మండలం నుంచి భక్తులు సంగెం తరలివెళ్లారు. గజ్జలమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ, మహాలక్ష్మీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. లోకేశ్వరం మండలంలోని కనకాపూర్, అబ్దుల్లాపూర్, జోహర్పూర్ గ్రామ వాసులు సైతం సంగెం గంగమ్మ జాతరకు బయలుదేరి వెళ్లారు.